వందశాతం పూర్తిచేయాలి
ప్రజలకు అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్
ఉట్నూర్, డిసెంబర్ 8 : గిరిజన గ్రామాల్లో నైట్ వ్యాక్సినేషన్ నిర్వహించి 100 శాతం పూర్తిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్తో కలిసి ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల మెడికల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు గిరిజన గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడే వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. మండల అధికారులు పాల్గొన్నారు.