ఏకరాకు 6-8 క్వింటాళ్ల దిగుబడి
కోత దశకు చేరుకున్న పైరు
ప్రభుత్వ మద్దతు ధర రూ.6,300
పెంచాలంటున్న రైతులు
నేరడిగొండ, డిసెంబర్ 7 : కంది పంటను బోథ్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో పండిస్తున్నారు. బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్హత్నూర్,గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొండ ప్రాంతాల్లో కందిసాగవుతున్నది. ఈ ఏడాది పంట బాగుండడంతో రైతుల అంచనాలు పెరిగాయి. మండలంలోని చాలా గ్రామాల్లో కంది పంట విరగకాసింది. పంట ఏపుగా పెరిగి, జడలుగా కాత కాయడంతో మొక్కలు బరువుతో నేలకొరిగాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వాపకాలం సీజన్లో 18 వేల ఎకారాల్లో రైతులు కంది సాగు చేస్తున్నారు. ఇందులో మెజార్జీగా ఆశ రకం, పీఆర్జీ,ఎల్ఆర్జీ, నిర్మల్దుర్గ, దఫ్తరీ, అంకూర్చార్ వంటి రకాలను వేశారు. సకాలంలో విత్తడం, వర్షాలు కూడా అనుకూలంగా కురవడంతో పంట ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ సారి పంట దిగుబడి ఎక్కువగా రావచ్చన్న అంచనాలతో రైతులు ఉన్నారు. నల్లరేగడి భూముల్లో ఎకరాకు 6-8 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరో రెండు వారాల్లో పంట కోతకు వస్తున్నది. ముందుగా విత్తిన చెలక నేలల్లో పంటను ఇప్పటికే కోతలు కోస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో కంది పంట రాశులు జోరుగా వస్తాయి. కాపు బాగుందని రైతులు సంబరపడుతున్నా ధర విషయంలో దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలకు పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, కంది పంటకు మద్దతు ధర లభిస్తే కొంత మేర లాభిస్తుందని అంటున్నారు.
ధర పెంపుకోసం గంపెడాశలు…
కంది పంటకు ఈ సారి ప్రభుత్వం నుంచి మంచి మద్దతు ధర లభిస్తుందని రైతులు గంపెడాశతో ఉన్నారు. రెండేళ్ల క్రితం క్వింటాలు రూ.12 వేల దాక పలికిన కందులు గతేడాది రూ. 5 వేలు దాటలేదని రైతులు పేర్కొంటున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, పెట్టుబడికి అనుగుణంగా కందుల మద్దతు ధర పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ధర రూ.6,300గా నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
మరో పక్షం రోజుల్లో కందులు చేతికొస్తాయి. బయట మార్కెట్లో కందుల ధరలు తక్కువగా ఉండడంతో అక్కడ విక్రయిస్తే నష్టపోయే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయి. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మేలు. మద్దతు ధర రూ.6,300 లు ఉంది.
బీ భాస్కర్, ఏవో నేరడిగొండ