ముగ్గులు వేసి.. కోలాటాలు ఆడి అభిమానాన్ని చాటుకున్న మహిళలు
పాటలు పాడుతూ ఉత్సాహంగా విద్యార్థుల నృత్యాలు
డప్పు చప్పుళ్ల మధ్య రైతుల ఎడ్లబండ్ల ర్యాలీలు..
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు టీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం..
ఆదిలాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రైతుబంధు వారోత్సవాలు ఆరో రోజైన శనివారం కూడా అద్భుతంగా కొనసాగాయి. ఐదు రోజులుగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు వివిధ రూపాల్లో సంబురాలు నిర్వహిస్తున్నారు. పల్లెలు, పంచాయతీలు, కూడళ్లు, పాఠశాలల్లో విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు ముగ్గులు వేయడం, కోలాటాలు ఆడడం, డ్యాన్సులు చేయడం, కబడ్డీ ఆడుతూ సంబురాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు డప్పు చప్పుళ్ల మధ్య ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్, ముథోల్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్రెడ్డి, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజైన శనివారం ఉరూవాడా పండుగ వాతావరణం నెలకొంది. రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు సంబురాల్లో పాల్గొన్నారు. పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజూరా రైతువేదికలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎడ్లబండ్ల ర్యాలీ తీశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఘన్పూర్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు. కోలాటం ఆడారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని సూరారం, జెండా వెంకటాపూర్, దౌడేపల్లి గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. – ఆదిలాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)