తొలిరోజు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు
అరుదైన జాతులను కెమెరాల్లో బంధిస్తూ ఆహ్లాదం
బెజ్జూర్, సిర్పూర్(టి), పెంచికల్పేట్, కాగజ్నగర్ మండలాల్లో సందర్శన
వీక్షకులకు పూర్తి ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ అధికారులు
నేడూ కొనసాగనున్న కార్యక్రమం
కాగజ్నగర్ రూరల్/బెజ్జూర్/ పెంచికల్పేట్/సిర్పూర్ (టి), జనవరి 8: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ డివిజన్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ వాక్ ఫెస్టివల్-2 శనివారం ప్రారంభమైంది. బెజ్జూర్, సిర్పూర్(టి), పెంచికల్పేట్, కాగజ్నగర్ రేంజ్ల పరిధిలో 21 ఆవాసాలను గుర్తించి, అక్కడికి పక్షి ప్రేమికులను తీసుకెళ్లారు. వీరితో పాటు వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో పక్షులను బంధించారు. హైదరాబాద్, వరంగల్, వివిధ ప్రాంతాల నుంచి, పెద్ద సంఖ్యలో పక్షి ప్రేమికులు తరలిరాగా, అటవీ శాఖ కాగజ్నగర్ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం కూడా కార్యక్రమం కొనసాగనుంది. కాగజ్నగర్ మండలంలోని కోసిని రిజర్వాయర్, వేంపల్లి సోలార్ ట్యాంక్, కడంబా, పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు అటవీ ప్రాంతం, చెరువు, కొండెంగలొద్ది, గుండెపల్లి బేస్ క్యాంప్, చిన్న ఊట్ల దొడ్డులై,గుండెపల్లి మొండిగుట్ట, కమ్మర్గాం ఫారెస్ట్, మొర్లిగూడ రివర్ ఈకో సిస్టం, పాత సార్సాల చెరువు దరోగపల్లి చెరువు, సిర్పూర్(టి) మండలంలోని సిర్పూరు చెరువు, గోయల్ అటవీ ప్రాంతం, మాలిని టవర్, బెజ్జూర్ మండలంలోని గొల్లబాయి చెరువు, సిద్ధాపూర్, గబ్బాయి బేస్ క్యాంప్, సమ్మక్క సారక్క ఇందర్గాం బీట్, తలాయి రివర్, గబ్బాయి చెరువు అటవీ ప్రాంతాల్లో పక్షి ప్రేమికులు వివిధ రకాల పక్షులను తమ కెమెరాల్లో బంధించారు.
కోసిని రిజర్వాయర్ ప్రాంతాల్లో జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం, ఎఫ్డీవో విజయ్ కుమార్, అటవీ అధికారులు పర్యవేక్షించారు. బెజ్జూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో రేంజ్ అధికారి పుర్క దయాకర్ ప్రారంభించారు. గజ్వేల్, కరీంనగర్, హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఫారెస్ట్ అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాల్లో వారిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. మొత్తం 21 మంది పక్షి ప్రేమికులు రాగా, రెండు టీమ్లు పంపించారు. డీఆర్వో సవిత, ఎఫ్బీవోలు అనిత, సంఘదీప్, వెంకటేశ్, మురళి, అనిమల్ ట్రాకర్స్ సిబ్బంది మహేశ్, సుభాష్, రాకేశ్, బేస్ క్యాంప్ సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని గుండేపల్లి బేస్క్యాంప్ నుంచి ఎఫ్ఆర్వో వేణుగోపాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు బృందాలుగా ఎంపికచేసి ప్రత్యేక వాహనాల్లో వీక్షకులను తరలించారు. హైదరాబాద్,వరంగల్ నుంచి వచ్చిన 25 మంది ఇందులో ఉన్నారు. బృందాలకు వసతులపై ఎఫ్డీవో శాంతారాం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిర్పూర్(టీ) రేంజ్ పరిధిలోని చీలపల్లి, లింబుగూడ, భూపాలపట్నం అటవీ శివారులో సందర్శకులు పర్యటించారు. కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్కుమార్, సిర్పూర్(టి) రేంజ్ అధికారి పూర్ణచందర్రావు, డీఆర్వోలు ప్రకాశ్నాయక్, మోహన్రావ్, అటవీ సిబ్బంది, సందర్శకులు పాల్గొన్నారు.