రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్
నిర్మల్లో పోలింగ్ కేంద్రం పరిశీలన
నిర్మల్ టౌన్, డిసెంబర్ 7: ఈ నెల 10న జరగనున్న శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను నిర్మల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తిరిగి వచ్చే మార్గాలను స్వయంగా చూశారు. పోలింగ్ కేం ద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ హేమం త్ బోర్కడే, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ జాకీర్, జడ్పీ సూపరింటెండెంట్ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి..
శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే కోరారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. భైంసా, నిర్మల్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.