తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
బేలలో రైతులకు అవగాహన
కోబ్బాయి గ్రామంలో ముగిసిన సప్తాహ వేడుకలు
బేల, డిసెంబర్ 7 : రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని, దీంతో అధిక లాభాలు పొందవచ్చని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. బేల మండల కేంద్రానికి చెందిన రైతు తన్వీర్ ఖాన్ తన పొలంలో సాగు చేసిన శనగ, కంది పంటలను మండల నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆరుతడి పంటల సాగుపై కరపత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు శనగ, మినుములు, పెసర, బబ్బెర్లు తదితర పంటలు చేయాలన్నారు. శనగ పంటలో వేరు కుళ్లు తెగులు నివారణపై వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో సాగుచేసి, ఎక్కువ లాభాలు పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. అలాగే వారం రోజుల్లో రైతు ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం కూడా జమ అవుతుందన్నారు. బేల మండలంలో ఎక్కువ శాతం పత్తి, సోయ సాగు చేస్తారని, దీంతో పాటు కూరగాయలు సాగుచేస్తే మంచి లాభలు పొందవచ్చని తెలిపారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవుత్ మనోహర్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రె, పార్టీ మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కుల మధుకర్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు మంగేశ్ ఠాక్రె, కో ఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, నాయకులు సతీశ్ పవర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సప్తాహ వేడుకల్లో ఎమ్మెల్యే..
మండలంలోని కోబ్బాయి గ్రామంలో సప్తాహ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని బాజీరావు మహరాజ్ చూపిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. భక్తులు భజన సంకీర్తనలతో గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.