ముకరంపుర, డిసెంబర్ 7: సాగు చట్టాల రద్దుకు ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా పోరాడాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన యూనియన్ కరీంనగర్ ప్రాంతీయ శాఖ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రం విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు వాపసు తీసుకునేదాక కొట్లాడాలని కోరారు. బుధవారం భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సాయిబాబు మాట్లాడుతూ, ప్రైవేటీకరణ బిల్లుతో కేంద్రం విద్యుత్ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ నెల 15న ఢిల్లీలో చేపట్టనున్న నిరసనలతో కేంద్రం మెడలు వంచి సంస్థ, వినియోగదారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ పద్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణతో సహా పలు రాష్ర్టాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు.
విద్యుత్ను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రజలకు ఏమివ్వాలని అనుకుంటున్నదో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిస్కం ప్రెసిడెంట్ బీ రఘునందన్ మాట్లాడుతూ, యూనియన్ సంస్థను కాపాడుకుంటు కార్మికుల కష్టాల్లోనూ పాలుపంచుకుంటున్నదన్నారు. సమన్వయంతో సంస్థను బలోపేతం చేయాలని, పోటీతత్వం కేవలం ఎన్నికల వరకే ఉండాలని కోరారు. డిస్కం సెక్రటరీ టీ శేషగిరిరావు, అడిషనల్ సెక్రటరీ కే రంగారావు మాట్లాడుతూ, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రైవేటీకరణ చట్టం వస్తే ఏం చేయాలనే అంశాలపై ఆలోచించాలన్నారు. జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ వీ గంగాధర్ మాట్లాడుతూ, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్మ్యాన్డ్ కార్మికుల సమస్యలను డీఈలు, తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రాంతీయ కార్యదర్శి రంగు వెంకట్ నారాయణ, డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడ్వైజర్ ఆర్ జనార్దన్రెడ్డి, డీఈలు జే రాంచందర్రావు, ఏ రాజిరెడ్డి, పీ చంద్రమౌళి, పీ విజేందర్రెడ్డి, ఎస్ బాలయ్య, జీ సాంబరెడ్డి, ఎస్ఏవో వీ రాజేంద్రప్రసాద్, జిల్లా కో ఆర్డినేటర్ ఎస్ జయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ వీరయ్య, అడిషనల్ సెక్రటరీ కే నర్సింగరావు పాల్గొన్నారు.