మంత్రి అల్లోల ఇంద్రకర్రెడ్డి
మహాదేవుడి దర్శనానికి బారులు
ఎడ్లబండ్లు, వాహనాల్లో రాక
బోథ్, డిసెంబర్ 7: దేశంలోనే రెండో కాశీగా కైలాస్ టేకిడి శివక్షేత్రం విలసిల్లుతున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్రెడ్డి అన్నారు. బోథ్ మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలో కొలువైన కైలాస్ శిఖర గుట్టలోని నర్మదేశ్వరుడి ఆలయంలో ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావ్, రేఖానాయక్, మాజీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్తో కలిసి మంగళవారం పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు శ్రీసంత్ లింబాజీ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా లింబాజీ మహారాజ్ కృషితోనే శివాలయం రూపుదిద్దుకుందన్నారు. రాబోయే రోజుల్లో దక్షిణాది కాశీగా విరాజిల్లుతుందన్నారు. ఐదు రోజుల పాటు మహాదేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కేసీఆర్ హయాంలోనే ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయిస్తామన్నారు. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్, నేరడిగొండ జడ్పీటీసీలు ఆర్ సంధ్యారాణి, జాదవ్ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, టీఆర్ఎస్ కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తజనం
మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలో కొలువైన మహాదేవుడి జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. బోథ్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని కిన్వట్, భోకర్, నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆటోలు, జీపులు, ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్ల లో వచ్చారు. నర్మదేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీసంత్ లింబాజీ మహారాజ్ భక్తులనుద్దేశించి మా ట్లాడారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పరమాత్ముడు మనలోనే ఉన్నాడని, ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలన్నారు.
పోలీసుల బందోబస్తు..
కైలాస్ టేకిడి మార్గంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి ఐకేరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బాపురావ్, రేఖానాయక్, ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్ రాకతో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. బోథ్ సీఐ ముదావత్ నైలు ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజు, అరుణ్కుమార్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.