పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 7: దివ్యాంగులు మనోధైర్యం కోల్పోకుండా జీవనయానంలో ముందుకు సాగాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో మంగళవారం డీడబ్ల్యూవో, డీఆర్డీవో ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు పాటలు, పాడుతూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పలువురు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న దివ్యాంగులను సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీడబ్ల్యూవో రవూఫ్ ఖాన్, డీఆర్డీవో శ్రీధర్, దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు శ్రీనివాస్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు.
జూలపల్లిలో..
జూలపల్లి, డిసెంబర్ 7: జూలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ దారబోయిన నరసింహం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఇక్కడ ఎస్ఎంసీ చైర్మన్ ఏదుల్ల కనకయ్య, ఏపీ ఎం తులసీమాత, పంచాయతీ కార్యదర్శి అనంతుల లచ్చయ్య, మానుమండ్ల శ్రీనివాస్, మేర్గు రమేశ్, సంపత్, రాములు, స్వామి, మల్లయ్య, కన్నం రవి, దీకొండ రాజేశం పాల్గొన్నారు.