
అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలి
పెండింగ్ సమస్యలపై కలెక్టర్లు దృష్టి సారించాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ఉమ్మడి జిల్లాలో రహదారుల నిర్మాణంపై సమీక్ష
సమావేశంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
నిర్మల్ అర్బన్, జనవరి 7 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రహదారుల పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో శుక్రవారం అధికారులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రోడ్ల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి యుటిలిటీ షిఫ్టింగ్, భూ సేకరణ, అటవీ శాఖ అనుమతులు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల రోడ్ల నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతున్నదన్నారు. ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో.., ఎక్కడ పెండింగ్లో ఉన్నాయో.. వివరాలు తెలియడంలేదని పేర్కొన్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఆలస్యమవుతున్నదని తెలిపారు. రోడ్ల నిర్మాణం అటవీ ప్రాంత గ్రామాల్లో కుంటల నిర్మాణం, అటవీ అనుమతులు, పెండింగ్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ సమస్యలను జిల్లాల వారీగా తయారు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు.
క్షేత్ర స్థాయిలో త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి సరైన రూపంలో ప్రతిపాదనలు పంపిస్తే సమయం వృథా కాదని తెలిపారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగితే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని, అనారోగ్యానికి గురైతే అంబులెన్స్లు కూడా రాక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. వెనుకబడిన పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. బాధ్యతతో వ్యవహరించి, ప్రజల్లో అధికారులపై ఉన్న అపోహలు తొలగించుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు దయాకర్రావు, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, అటవీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.