పాఠశాలల్లో ఉపాధ్యాయులు..
నాల్గో తరగతి నుంచి డీటీ క్యాడర్ వరకు ప్రక్రియ పూర్తి
సొంత జిల్లాలు, ఒకే చోటుకు చేరిన దంపతుల్లో ఆనందం
నిర్మల్ టౌన్, జనవరి 7 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బదిలీ అయిన ఉద్యోగులు శుక్రవారం నుంచి విధుల్లో చేరుతున్నారు. రాష్ట్ర సర్కారు కొత్త జోన్ల వారీగా బదిలీలకు శ్రీకారంచుట్టగా, సీనియార్టీ ప్రాతిపదికన ఆయా శాఖల ఉద్యోగులకు స్థానచలనం కల్పించింది. శాఖల వారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిపోర్ట్ చేస్తుండగా, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సందడి నెలకొంది. సొంత జిల్లాలకు చేరిన వారితో పాటు ఒకేచోటుకు బదిలీ అయిన దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త జోన్లలో ఉద్యోగాల్లో చేరిక ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం 2018లో కొత్త జోన్లకు శ్రీకారం చుట్టగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాల్లో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాలను బాసర జోన్గా, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాలను కాళేశ్వరం జోన్గా విభజించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా సీనియార్టీ ప్రాతిపదికన ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఇటీవలే బదిలీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా నోడల్ కేంద్రంగా 60 ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల సీనియారిటీ ప్రాతిపదికన బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 30వేల వరకు ఉద్యోగులుండగా.. అందులో 9,356 మంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికే రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ, పంచాయతీరాజ్, విద్య, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్, పోలీసు, వ్యవసాయ, పశువైద్య, వైద్య శాఖల్లో నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టారు. ఆయా జిల్లాలకు సీనియార్టీ ప్రకారం ఉద్యోగుల కేటాయింపు నిర్వహించడంతో వారంతా మూడు రోజుల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం నుంచి పెద్దఎత్తున ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల్లో నాలుగు రోజుల క్రితమే ఉద్యోగులు జాయిన్ అవగా, ఇప్పుడు రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, నీటిపారుదల, అగ్రికల్చర్, వ్యవసాయశాఖల్లో జోన్ల కేటాయింపు పూర్తి కావడంతో ఉద్యోగులందరూ కొత్త జోన్లలో తప్పనిసరిగా చేరాల్సి వచ్చింది. ముఖ్యంగా విద్యాశాఖలో 317 జీవోపై ఉపాధ్యాయులు వారం రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త జోన్లలో చేరిన తర్వాత దంపతుల విభాగంతో పాటు ఆరోగ్య సమస్యలున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యమిచ్చింది. దీంతో ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు సొంత జిల్లా రావడానికి అవకాశం ఏర్పడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఐదో జోన్గా ఉన్న వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాలు ఉండగా.. ఇప్పుడు బాసర, కాళేశ్వరం జోన్లు వేరు కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
నాకు ఎస్జీటీగా 2019లో ఉద్యోగం వచ్చింది. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్ మండలం ఎన్కపల్లి (బీ) పాఠశాలలో విధుల్లో చేరా. రెండు సంవత్సరాలుగా అక్కడే ఉంటూ ఎన్నో ఇబ్బందులకు గురయ్యా. ఇప్పుడు ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగుల బదిలీలు చేపట్టింది. దీంతో నాకు సీనియారిటీ లేకపోయినప్పటికీ స్పౌజ్ కేటగిరీ కింద ప్రభుత్వం బదిలీల్లో ప్రాధాన్యమివ్వడంతో నిర్మల్ జిల్లాకు కేటాయించారు. మా ఆయన జగదీశ్ ఈ జిల్లాలోనే పని చేయడం, నేను అక్కడ పని చేయడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ బాధలన్నీ తొలగిపోయాయి. కొత్త జోన్లో ఇద్దరం ఒక్కచోటికి చేరడం సంతోషంగా ఉంది.
కొత్త జోన్లో పని చేస్తామని అనుకోలేదు..
కొత్త జోన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఈ జోన్లోనే సర్వీస్ కాలం పూర్తి చేయడానికి మంచి అవకాశం ఏర్పడింది. బాసర జోన్గా ఏర్పాటు చేయడంతో ఇక్కడ పని చేస్తున్న నన్ను ఈ జోన్కే కేటాయించారు. దీంతో శుక్రవారం కొత్త జోన్లో చేరడానికి కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేశా. నిర్మల్ పట్టణం బాసర జోన్లో మధ్యంతరంగా ఉండడంతో ఎక్కడికెళ్లినా 60 కిలోమీటర్లలోపే పని చేసే అవకాశం ఉందీ. దీంతో ఇక్కడ స్థిరపడేందుకు మంచి అవకాశం లభించింది.