జిల్లా, మండల పరిషత్లకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాకు రూ. 26.23 కోట్లు..
జడ్పీకి రూ.13.21 కోట్లు, మండలాలకు రూ. 13.02కోట్ల చొప్పున..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 5 : స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజలకు పారదర్శకమైన పౌర సేవలను అందించేందుకు ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కింద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులను కేటాయించింది. ఈ మేరకు శనివారం పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి శరత్ ఆయా జిల్లాలకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని జడ్పీలతో పాటు మండల ప్రజా పరిషత్లకు నిధులు కేటాయించగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జల్లాకు రూ. 26.23 కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా జనాభాను బట్టి ప్రతినెలా నిధులను కేటాయిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఈ నిధులను కేటాయించడంతో పల్లెల్లో ప్రగతి పనులు వేగంగా సాగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలుండగా.. జిల్లాలతో పాటు 68 మండలాలకు నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జల్లా పరిషత్లకు రూ.13.21 కోట్లు కేటాయించగా.. జనరల్ ఫండ్ కింద రూ.9.49, ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.1.86 కోట్లు, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.1.89 కోట్ల్ల నిధులను కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 68 మండలాలకుగాను జనరల్ ఫండ్ కింద రూ.9.26 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.1.83 కోట్లు, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.1.94 కోట్ల చొప్పున మొత్తం రూ.13.02 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో జిల్లా, మండల పరిషత్ ద్వారా ఆయా గ్రామాల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 50 శాతం నిధులు కేటాయించనున్నారు. మిగతా 50శాతం నిధులతో గ్రామాల్లో ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపట్టేలా త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు జడ్పీ అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకూ ప్రత్యేక కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
పల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యతమిస్తున్నది. ఈ నేపథ్యంలో మండల పరిషత్లకు ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ ద్వారా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. జడ్పీ, మండల పరిషత్లకు ఎన్నికైన సభ్యులకు గ్రామాల్లో వారు చేపట్టే పనుల కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.26.23కోట్లు విడుదల కావడం సంతోషం. ఈ నిధులను ప్రజా ప్రాధాన్యమున్న పనులకు ఉపయోగించుకుంటాం.