సర్కారు స్కూళ్లలో పక్కాగా కొవిడ్ నిబంధనలు
ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలు
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి
విద్యాశాఖలో వందశాతం వ్యాక్సినేషన్
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 5 : ఒమ్రికాన్ వైరస్ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ ఈసారి ముందుగానే అప్రమత్తమైంది. దేశంలో నూతన వైరస్ కేసులు నమోదవుతుండడంతో వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, విస్మరిస్తే రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తమయ్యారు. కొవిడ్ వైరస్ అనంతరం పాఠశాలలు తెరుచుకున్నప్పటి నుంచే నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తుండడంతో కేసులను పూర్తిగా అరికట్టారు. కొత్త వేరియంట్ (ఒమ్రికాన్)ను అరికట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒమ్రికాన్ వైరస్ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇటీవలే విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా విద్యార్థులను అప్రమత్తం చేయాలని ఆదేశించింది. జిల్లాలోని పాఠశాలను డీఈవో రవీందర్ రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 862 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 162 ఉన్నత, 102 ప్రాథమికోన్నత, 598 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 54,875 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలు
కొవిడ్ థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీ చర్యలు చేపట్టారు. విద్యార్థులకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని వెం టనే గుర్తించి పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత పాఠశాలల్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఐసోలేషన్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ఉన్నత పాఠశాలల్లో గదుల కొరత లేని దృష్ట్యా హెచ్ఎంలు ఇప్పటికే ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాల్లో గదుల కొరత దృష్ట్యా ఉపాధ్యాయులు ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్యులకు తెలియజేయాలని, అవసరమైతే తల్లిదండ్రులను సంప్రదించి కొవిడ్ టెస్టులునిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
థర్డ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థుల చదువులతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులను 100 శాతం పాఠశాలకు, ఇంటికే పరిమితం చేయాలని దూర ప్రయాణాలు, ఫంక్షన్లకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, జనసమ్మర్ధ ప్రదేశాలకు తీసుకెళ్లకుండా చూడాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూ చిస్తున్నారు. ప్రతీ విద్యార్థిపై ఆయా పాఠశాలల ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విద్యార్థులు ఎలాంటి భయాందోళన చెందకుండా పాఠశాలలకు వెళ్తున్నారు.
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి
పాఠశాలలతో పాటు వసతి గృహాల విద్యార్థులపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. విద్యార్థులు హాస్టల్లోనే ఉండడం శ్రేయస్కరమని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కలువడానికి వచ్చి ఇతర విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేయవద్దని సూచిస్తున్నారు. పిల్లలు హాస్టల్లోనే ఆరోగ్యంగా ఉంటారని, వారి బాధ్యత మాదే అంటూ వాట్సాప్ గ్రూపుల్లో తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.
100 శాతం వ్యాక్సినేషన్
ప్రభుత్వ పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇప్పటికే కలెక్టర్, డీఈవోలు పాఠశాలల్లోని వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అందరూ టీకా తీసుకోవడంతో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో వైరస్ వ్యాప్తికి అవకాశం తక్కువగా ఉంటుంది.