తలమడుగు, డిసెంబర్ 5 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఖోడద్ పంచాయతీ పాలకవర్గం వందశాతం సద్వినియోగం చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ పల్లెలను అందంగా తీర్చిదిద్దేందుకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఉపయోగించుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ జిల్లా అధికారుల మన్ననలు పొందుతున్నారు. గ్రామం లో దాదాపు రూ.80 లక్షల వ్యయంతో వివిధ రకాల పనులు చేపట్టారు. పల్లె ప్రకృతి వనం, హరితహారం, శ్మశాన వాటిక, డంప్ యార్డు, గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వివిధ రకాల పనులను చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దారు. గ్రామంలో 523 కుటుంబాలు, 2104 జనాభా, 1400 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.12.50 లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టారు. రూ.2.50లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.7లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. రెండు పల్లె ప్రకృతి వనాలను రూ.4. 50లక్షలతో ఏర్పాటు చేశారు. రూ.22 లక్షల ఎస్ఎఫ్సీ, టీఎఫ్సీ నిధులతో గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించారు. హరితహారంలో నాటిన మొక్కలకు పంచాయతీ నిధులతో ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.
పచ్చదనం..పరిశుభ్రత
ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయడంతో సాయంత్రం వేళల్లో వృద్ధులు, చిన్నారులతో పార్కు ప్రతి రోజు సందడిగా ఉంటున్నది. నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు, యువకుల సహకారంతో గ్రామంలోని ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.