నూతన విధానానికి సర్కారు శ్రీకారం
కేంద్రాలకు నేరుగా సరుకులు సరఫరా
నిర్ణీత సమయంలో చేరవేత
అక్రమాలకు చెక్ ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయం
కోటపల్లి, డిసెంబర్ 5 : ఆర్టీసీ కార్గో సేవలు అంగన్వాడీ కేం ద్రాల వరకు విస్తరించాయి. గతంలో ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టర్ ద్వారా బాలామృతం, నూనె, మురుకులు, పప్పు సరఫరా అయ్యేవి. అయితే ఈ విధానం వల్ల జాప్యంతో పాటు అక్రమా లు జరుగుతుండడంతో వాటి నివారణకు ప్రభుత్వం కార్గో సేవలను వినియోగించుకునేందుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నుంచి నేరుగా సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు చేర్చడంతో ఆర్టీసీకి ఆదాయం పెరుగుతున్నది. ప్రతి నెలా ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు నిర్ణీత సమయంలోగా కార్గో ద్వారా సరుకులు చేరుతుండడంతో అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్గో సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు సరుకులతో చేరుకొని బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమోదు చేసి అందజేస్తున్నారు. దీని ద్వారా సరుకులు పక్కదారి పట్టకుండా సకాలంలో అందుతున్నాయని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు.
ప్రతి నెలా కార్గో ద్వారానే..
ప్రతి నెలా ఆర్టీసీ కార్గో ద్వారానే అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కేంద్రాలకే వస్తుండడం వల్ల సకాలంలో అందుతున్నాయి. కార్గో ద్వారా సరుకులు పంపిణీ చేస్తుండడం సంతోషంగా ఉంది.
-రాజమణి, అంగన్వాడీ టీచర్, (కోటపల్లి)