దస్తురాబాద్, నవంబర్ 5 : సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలని భైంసా తహసీల్దార్ బత్తుల విశ్వంభర్, కడెం ఎస్ఐ కోదాడి రాజు అన్నారు. మండలంలోని మల్లాపూర్ గోండు గూడెం, ఆకొండపేట గోండు గూడేల్లో గురువారం నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో వారు పాల్గొన్నారు. గుస్సాడీని ధరించి ఆదివాసీలతో ఆడి పాడారు. ఆకొండపేటలో ఆదివాసీలకు కడెం ఎస్ఐ కోదాడి రాజు అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సీదర్ల భూమేశ్, ఉప సర్పంచ్ సిడాం రాజు, ఆదివాసీ గ్రామాల పటేళ్లు తదితరులు పాల్గొన్నారు.
మారుమోగుతున్నగూడేలు
ఆదివాసీ గూడేల్లో దండారీ వేడుకలు ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. డుప్పు చప్పుళ్లతో గూడేలు మారుమోగాయి. దీపావళి రోజు మండలంలోని గోండు గూడెంలో దండారీ ఉత్సవాలను ఆదివాసీలు వైభవంగా జరుపుకున్నారు. గుస్సాడీ వేషధారణ చేసిన వారిని గుస్సాడీ దేవత ఆవహిస్తుందని, గుస్సాడీ దండతో తాకితే ఎలాంటి రోగాలైనా నయం అవుతాయని నమ్మకం.
సంస్కృతిని కాపాడాలి
పెంబి, నవంబర్ 5: గిరిజనుల సంస్కృతిని కాపాడాలని ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్ ఆన్నారు. శుక్రవారం కోశగుట్టలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో గుస్సాడీలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలు దీపావళికి 15 రోజుల ముందు నుంచి నిర్వహించే ఉత్సవాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయన్నారు. వైస్ ఎంపీపీ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు కున్సోత్ విలాస్ ఉన్నారు.