ప్రజలు, దాతలు కదలాలి
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులు, టీచర్ల సహకారం
కళలు, జీవన ప్రమాణాల పెంపునకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు
మంచిర్యాల జిల్లా పోర్టల్లో 505 ప్రభుత్వ పాఠశాలల నమోదు
మంచిర్యాల, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : విద్యాంజలి 2.0 పథకం ప్రతి పాఠశాలలో అమలయ్యేలా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నది. పిల్లలకు చదువుతో పాటు ఇతర అంశాలపై కూడా పూర్తి పట్టు రావాలని యోచిస్తున్నది. వారు జీవితంలో మరింత ముందుకు సాగాలని, చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఏ రంగంలోనైనా సత్తా చూపగలమనే మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. వివిధ రంగాల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన వారు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు తమ ప్రతిభను నలుగురికీ పంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడనున్నది.
‘విద్యాంజలి-2.0’ అంటే?..
పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలనుకునే సంస్థలు, వ్యక్తుల పరిధిని విస్తృతం చేసేందుకు ఒక వేదిక కల్పించడమే విద్యాంజలి ముఖ్య ఉద్దేశం. పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని ఒక వ్యవస్థీకృత వేదిక ద్వారా అమలు చేయడం, తద్వారా పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం వంటివి దీని ముఖ్య లక్ష్యాలు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తప్పా అన్ని ప్రభుత్వ పాఠశాలలూ తమ వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ కార్యక్రమంపై శిక్షణ పూర్తయ్యింది. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు మినహా మిగిలిన 505 ప్రభుత్వ పాఠశాలలు రిజస్టర్ చేసుకున్నాయి.
బోధనపై ఉత్సాహం ఉన్నవారికి అవకాశం..
బోధనపై ఉత్సాహం ఉన్న స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, వ్యక్తులు, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఎవరైనా సరే వారికి అనుకూలమైన పాఠశాలల్లో, వీలైన సమయంలో అకాడమిక్ విషయాలపై వివరించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తున్నది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి అంశాలే కాకుండా కళలు, జీవన నైపుణ్యాలు, వృత్తిపరమైన విద్యలు, పోటీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయడం, కథలు రాయించడం, ఇంకా ఇతర నైపుణ్యాలను మెరుగుపర్చడం వంటి విషయాల్లో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఉత్సాహవంతులకు ప్రాయోజితం కల్పించడం వంటివి కూడా విద్యాంజలి 2.0లో భాగమే. పాఠశాలకు కావాల్సిన ఆట వస్తువులు సమకూర్చడం, తరగతి గదుల్లో కావాల్సిన లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడం, గ్రంథాలయాల ఏర్పాటు, ఐసీటీ పరికరాల ఏర్పాటు, పిల్లలకు కావాల్సిన బెంచీల ఏర్పాటు, ఇంకా పాఠశాలలకు కావాల్సిన ఇతర అవసరాలు తీర్చేందుకు ఈ పథకం ద్వారా వీలుంటుంది. జిల్లాలో 811 పాఠశాలలకు గాను.. 506 స్కూల్స్ నమోదు చేసుకున్నాయి.
ఎలా పాల్గొనాలంటే..
ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని అవసరాలను పోర్టల్లో నమోదు చేయాలి. వారి గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఉన్న దాతలు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలి. వారు ఎలాంటి సహకారం అందించగలరో పోర్టల్లో నమోదు చేయించాలి. ప్రధానోపాధ్యాయులే కాకుండా మండల, జిల్లా విద్యాశాఖలు సైతం సహాయ సహకారాలను అందిస్తాయి. దీనికి అనుగుణంగా ఆయా సంస్థలు కానీ, వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి పరస్పర అవగాహనతో పాఠశాల అభివృద్ధిలో పాల్గొనేలా చేస్తారు. దీనిపై హెచ్ఎంలకు త్వరలో శిక్షణనిచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా.. బోధనలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలకు ఎలాంటి గౌరవవేతనం ఉండదు. కేవలం సమాజ సేవ చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
సమాజ పాత్రను ప్రోత్సహించేందుకే..
పాఠశాలల అభివృద్ధిలో సమాజ పాత్రను ప్రోత్సహిం చడమే ఈ విద్యాంజలి కార్యక్రమం లక్ష్యం. సంస్థలు, వ్యక్తులకు ఆయా పాఠశాలలపై ఎలాంటి అధికార పరిధి ఉండదు. బోధనలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలకు ఎలాంటి గౌరవవేతనం కూడా ఉండదు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవ మాత్రమే.