ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్
ఇచ్చోడలో రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్బాల్ పొటీలు ప్రారంభం
ఇచ్చోడ, డిసెంబర్ 4: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు రాణించిన క్రీడాకారులకు ఉద్యోగ, ఉన్నత విద్యకు రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శులు జాదవ్ అనిల్, గంగాధర్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, సాఫ్ట్ బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, మేరాజ్ అహ్మద్, పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
శనేశ్వరుని సన్నిధిలో జడ్పీ చైర్మన్ పూజలు
నార్నూర్, డిసెంబర్ 4 : శని అమావాస్య సందర్భంగా మండలంలోని భీంపూర్ గ్రామంలో శనేశ్వరుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొని పూజలు చేశారు. భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మికతను అలవర్చుకున్నప్పుడే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాతను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ సురేశ్, సర్పంచ్ రాథోడ్ విష్ణు, మాజీ సర్పంచ్ రాథోడ్ రాజునాయక్, నాయకులు హైమద్, సయ్యద్ ఖాసీం పాల్గొన్నారు.