నాగోబా ఆలయం వద్ద తొడసం వంశీయుల ప్రత్యేక పూజలు
22 ఎడ్లబండ్లతో పయనం..
ఇంద్రవెల్లి, జనవరి 4 : ఖాందేవ్ ప్రతిమల కోసం కెస్లాపూర్ వచ్చిన తొడసం వంశీయులు మంగళవారం నార్నూర్ తీరుగు పయనమయ్యారు. నాగోబా ఆలయ పరిసర ప్రాంతంలో గ్రానైట్తో తయారుచేసిన 17 ప్రతిమలను తీసుకొని బయల్దేరారు. ముందుగా ఆలయంలో.., ఖాందేవ్ ప్రతిమలకు సంప్రదాయ పూజలు చేశారు. అలాగే ప్రతిమలను తరలించే ఎడ్లబండ్లకు కెస్లాపూర్ వాసులతో పాటు మెస్రం వంశీయులు పూజలు చేసి, సాగనంపారు. బండెనక బండికట్టి వరుసగా 22 ఎడ్లబండ్లతో సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ తరలివెళ్లారు. 17న నార్నూర్లోని ఖాందేవ్ పుణ్యక్షేత్రంలో జాతర ప్రారంభమవుతుందని తొడసం వంశీయుల పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాందేవ్ ఆలయ కమిటీ చైర్మన్ తొడసం నాగోరావ్, కటోడ బాపురావ్, తొడసం రాజుపటేల్, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం రూప్దేవ్పటేల్, తొడసం గోపాల్, సార్మేడి మడావి తుకారాం, తెలంగ్రావ్, నారింజి పటేల్, బాదిపటేల్, యాదవ్షావ్, భీంరావ్పటేల్, శాంతరాజ్, మెస్రం నాగ్నాథ్, మెస్రం శేఖర్బాబు, బాదిరావ్పటేల్, ఆనంద్రావ్, తుకారాం, లింబారావ్, కోశరావ్, కెస్లాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.