నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్
ప్రత్యేక టీకా క్యాంపు పరిశీలన
భైంసాటౌన్, జనవరి 4 : పాఠశాలలు, కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులు టీకా వేసుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ సూచించారు. కామోల్ ప్రభుత్వ పాఠశాలలో వైద్యాధికారులు ఏర్పాటు చేసిన టీనేజర్ల ప్రత్యేక టీకా క్యాంపును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా అర్హులు టీకా వేసుకోవాలని సూచించారు. అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఎంఈవో సుభాష్, ఎంఆర్వో విశ్వంబర్, హెచ్ఎం నరేందర్, ఎంపీవో మోజామ్ హుస్సేన్, హెచ్ఈవో సలీమ్, టీఆర్ఎస్ నాయకుడు అమేందర్ పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలి
నార్నూర్, జనవరి 4 : వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి విజయంతం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నుంచి 18 ఏళ్ల లోపు బాలబాలికలకు వ్యాక్సిన్ వేయించేలా చూడాలన్నారు. రెండు, మూడు గ్రామాల్లో పిల్లల వివరాలు తెలుసుకొని ప్రణాళిక రూపొందించాలని, ఎక్కువ మంది ఉన్న గ్రామంలో వ్యాక్సినేషన్ నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ, రికార్డులు నమోదు చేసుకొని, దవాఖానలో ప్రసవం పొందేలా చూడాలన్నారు. ఒమిక్రాన్ వైరస్ బారినపడకుండా ముందు జాగ్రత్తలను ప్రచారం చేయాలని ఆదేశించారు. నార్నూర్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ సంతృప్తిగా ఉందన్నారు. వందశాతం పూర్తి చేసేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో వైద్యురాలు రాజమణి, హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, సిబ్బంది చరణ్దాస్, రాజమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.