రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసే కుట్రలు
రెచ్చగొట్టి లబ్ధి పొందడమే వారి విధానం
ఓటు భయంతోనే వ్యవసాయ చట్టాలపై వెనక్కి..
కేంద్రం ఆంక్షలతో వరి సాగుకు గడ్డుకాలం
యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్, డిసెంబర్ 1 : బీజేపీ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, యాసంగిలో వరిసాగు చేయవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరంట్తో గత ఆరేళ్లలో గణనీయమైన సాగు పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం దేశానికి అన్నం పెట్టే వరి ధాన్యం పండిస్తే, జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ వారిని మోసం చేసేలా కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. వేసవిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చిచెపిందన్నారు. దీంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రానికి విన్నవించినా స్పష్టత ఇవ్వడంలేదని విమర్శించారు. అందుకే రాష్ట్ర సర్కారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని యాసంగిలో వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. రైతులపై కేంద్రం వివక్షత చూపుతున్నదని, పైగా రాష్ట్ర బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడడంపై ధ్వజమెత్తారు. వడ్లు కొంటరో.. కొనరో.. చెప్పాలని తమ ప్రభుత్వ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తుంటూ, బీజేపీ నేతలు మాత్రం ‘వరి పండించండి, ఎట్ల కొనుగోలు చేయరో చూస్తాం’ అంటూ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. దేశంలో కేంద్రం రైతు
వ్యతిరేక ప్రభుత్వమని, ఏడేళ్లలో రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. కార్పొరేట్ వ్యవసాయానికి కొమ్ముకాస్తూ వ్యవసాయ చట్టాలను తీసుకురాగా, రైతు సంఘాలు వ్యతిరేకించడంతో దిగివచ్చి వాటిని రద్దు చేసినట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వంపై అన్ని రాష్ర్టాల్లో వ్యతిరేకత పెరగడంతోనే వాటిని ఉపసంహరించుకున్నదని గుర్తుచేశారు. సాగు చట్టాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని వివిధ పార్టీల ఎంపీలు కోరుతున్నా పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో రైతు పోరాటంలో అమరులైన వారిని ఆదుకునేందుకు రూ.22.50 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి రైతులే బుద్ధిచెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకటరామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, టీఆర్ఎస్ నాయకులు పూదరి రాజేశ్వర్ పాల్గొన్నారు.