ఎదులాపురం, డిసెంబర్ 1 : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేకాధికారులు, మున్సిపల్ అధికారులతో బుధవారం వ్యాక్సినేషన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిపీటెడ్గా ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించడం వలన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ మిషన్ మోడ్లో పంపిణీ చేస్తామన్నారు. ప్రత్యేకాధికారులు సబ్ సెంటర్ వారీగా రివ్యూ చేయడం ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు, మెడికల్ టీంలు ఈ నెల 2 నుంచి ఉదయం 8 గంటలకు క్షేత్రస్థాయిలో ఉండాలని, ఆయా వార్డు, గ్రామ హాబీటేషన్స్లలో ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, గ్రామ పెద్దల సహకారంతో వ్యాక్సిన్ అందించాలన్నారు. ప్రణాళికతో అధికారులు, సిబ్బంది అర్హులైన వారికి ఈ నెల 31లోగా నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో డిగ్రీ, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. వ్యాక్సిన్కు సంబంధించిన ఏ సమాచారమైన టోల్ ఫ్రీ నంబర్ 7670904313ను సంప్రదించాలన్నారు. పట్టణంలో 200 చొప్పున వ్యాక్సిన్ చేపట్టాలన్నారు. ఇప్పటికే ఐదు వార్డులలో 100 శాతం వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ఇప్పటి వరకు పట్టణంలో 55 శాతం, గ్రామాల్లో 90.77 శాతం వ్యాక్సినేషన్ వేశామని మున్సిపల్, పంచాయతీ అధికారులు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీఈవో విజయసారథి, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీపీవో శ్రీనివాస్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.