రెండు డోసులు వేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలి
మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి
వీసీ ద్వారా సమీక్ష
పాల్గొన్న కలెక్టర్లతో సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ
ఎదులాపురం/ నిర్మల్ టౌన్, డిసెంబర్ 1 : కొవిడ్ థర్డ్వేవ్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి, వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా పూర్తిచేసి, దేశంలోనే తెలంగాణను ముందుంచుదామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కొన్ని దేశాల్లో బయటపడిందని, మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఈ వైరస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. కానీ, ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ను ఈ నెలాఖరు వరకు తప్పనిసరిగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకు అన్ని శాఖల సమన్వయంతో, ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 శాతం మొదటి డోస్, 46 శాతం రెండో డోస్ అందించినట్లు వెల్లడించారు. కలెక్టర్లు ప్రత్యేకంగా గ్రామాలు, వార్డుల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. వాయిస్ మెస్సేజ్ ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని, అలాంటి వాటిపై కలెక్టర్లు స్పందించాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి నుంచి వచ్చే ప్రతి సమాచారాన్నీ స్థానిక ప్రసార మాధ్యమాలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల వద్దకు చేరేలా కృషిచేయాలన్నారు. ప్రతి జిల్లాలో 24 గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. అన్ని దవాఖానల్లో బెడ్లు, ఆక్సిజన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే విద్యాలయాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్ అందించాలని, అందుకు జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, గురుకులాల్లో నిబంధనలు తప్పక పాటించాలని, వ్యాక్సిన్ వేసుకున్న ఉపాధ్యాయులు, సిబ్బందినే పాఠశాలలకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ మాట్లాడుతూ.. జిల్లాలో 78 శాతం మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తయినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా వైద్యశాఖ అధికారులు నరేందర్రాథోడ్, ధన్రాజ్, డీఐవో విజయసారథి, డీఆర్డీవోలు కిషన్, విజయలక్ష్మి, డీఈవోలు ప్రణీత, రవీందర్రెడ్డి, జడ్పీ సీఈవోలు గణపతి, సుధీర్కుమార్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, సిబ్బంది పాల్గొన్నారు.