ఎదులాపురం, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటరు నమోదు డేటా ఎంట్రీ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక గోయల్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు నమోదు ద్వారా అందిన క్లెయిమ్స్ వెంటనే అప్డేట్ చేయాలన్నారు. బూత్స్థాయి అధికారులకు గరుడా యాప్పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. స్వీప్ కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ ఒటరు నమోదుపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునేలా వివరించాలని సూచించారు. ఈ నెల 10న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్యాలెట్ పేపర్ల పరిశీలన చేపట్టి, సురక్షితంగా భద్రపరచాలని తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టాలన్నా రు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులుతో మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, మెటీరియల్ సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఐటీడీఏ పీవో అంకిత్, అదనప కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్టీవో రాజేశ్వర్, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ భోజన్న, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు రాజేశ్వర్, వర్ణ, నలంద ప్రియ, స్వాతి, నాయబ్ తహసీల్దార్లు సాయి మహేశ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.