ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయంపై ప్రయాణికుల సంతోషం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల మంది పిల్లల ప్రయాణం
నిర్మల్ టౌన్/ఆదిలాబాద్ టౌన్, జనవరి 1 : ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎండీ సజ్జనార్ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక రకాల రాయితీలు ఇవ్వగా.., కొత్త సంవత్సర కానుకగా 12 ఏండ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఈ మేరకు శనివారం ఒక్కరోజు అమలు చేశారు. ఉచిత ప్రయాణంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ పిల్లలతో కలిసి జిల్లాలో వివిధ దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. వారికి కండక్టర్లు, సిబ్బంది ఉచిత ప్రయాణ కానుక వివరించి, స్వాగతించారు. బస్సుల్లో కూర్చున్న చిన్నారులు, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్, భైంసా డిపోలు ఉండగా, మొత్తం 538 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. శనివారం రోజున ఉమ్మడి జిల్లాలో సుమారు 5వేల మంది పిల్లలు ఉచితంగా ప్రయాణించారు. కాగా, తల్లిదండ్రుల మాటల్లో..
రూ.240 మిగిలాయి..
మేము మా అత్తగారి ఊరైన జగిత్యాలకు మూడ్రోజుల క్రితం వెళ్లాం. శనివారం సొంత ఊరికి వస్తున్నాం. కల్లూరు నుంచి జగిత్యాలకు వెళ్లేందుకు పెద్దలకు ఒక్కొక్కరికీ రూ.90 టికెట్ ఉంది. నలుగురు పిల్లలతో కలిసి వచ్చాం. మా పిల్లలు హర్షిత, సుహాసిని, శివ, రక్షిత 12 ఏండ్లలోపు ఉంటారు. వచ్చేటప్పుడు టిక్కెట్టు తీసుకోలేదు. వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికీ రూ. 60 కాగా.. వచ్చేటప్పుడు రూ.240 మిగిలింది.-గణేశ్-జ్యోతి, కల్లూరు, కుంటాల మండలం
పొద్దున పోయి సాయంత్రం వస్తున్నా..
మాది ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్టి తండా. మా అమ్మ వాళ్ల ఊరు భైంసా. మా పిల్లలను చూడాలని అమ్మ ఫోన్ చేస్తే శనివారం భైంసా వెళ్లి, తిరిగి ఇంటికెళ్తున్నా. కుప్టి నుంచి భైంసాకు వెళ్లి రావడానికి పెద్దలకు రూ.100 చార్జి ఉంది. మా ఇద్దరు పిల్లలకు రూ.100 అవుతుంది. 12 ఏండ్లలోపు వారికి ఉచిత ప్రయాణం కావడంతో రూ. 100 చార్జి మిగిలింది. చాలా సంతోషంగా ఉంది. – చంద్రకళ, కుప్టి తండా, ఆదిలాబాద్ జిల్లా
ఆర్టీసీకి ఆదరణ పెరుగుతోంది..
మాది భైంసా పట్టణం. మా బంధువుల ఇంటికెళ్తున్నాం. ఇద్దరు పిల్లలతో కలిసి భైంసా నుంచి నిర్మల్ వచ్చాం. పెద్దలకు రూ.43, పిల్లలకు రూ.25 టికెట్ ఉండే. శనివారం మా పిల్లలు ఆదిత్య, శ్రీతన్కు కండెక్టర్ టకెట్ ఇవ్వలేదు. ఆర్టీసీలో ప్రయాణికులను పెంచుకునేందుకు ఎండీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతగానో సంతోషంగా అనిపించింది. ఆర్టీసీకి ఆదరణ పెరుగుతోంది.