ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి
ప్రిసైడింగ్, సెక్టోరల్ అధికారుల శిక్షణలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్
మామిళ్లగూడెం, నవంబర్ 30: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలను సమగ్రంగా అవగాహన చేసుకొని పూర్తి సంసిద్ధతతో పోలింగ్ విధులను నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఈ నెల 10న జరుగనున్న పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి నగరంలోని డీపీఆర్సీ భవనంలో మంగళవారం నిర్వహించిన మొదటి విడత శిక్షణలో ఆయన మాట్లాడారు. పోలింగ్ విధులను పూర్తి అప్రమత్తతతో నిర్వర్తించాలని, చిన్నపాటి పొరపాటు జరిగినా రీ పోలింగ్కు అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో తప్పు జరిగితే సరిచేసుకునే అవకాశం లేదు కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ బాక్సులకు సీల్ చేయడం, పేపర్ సీల్ వేయడం వంటి విషయాలను పోలింగ్ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ఆచరణాత్మకంగా చేయించారు. ఈ నెల 6న రెండో విడత శిక్షణ ఉంటుందన్నారు. మాస్టర్ టైనర్ శైలేంద్ర, నాగిరెడ్డి, నోడల్ అధికారి శ్రీరామ్ తదితరులు పోలింగ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్. మధుసూదన్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.