ఆదిలాబాద్లో అధికారులకు శిక్షణ
ఉమ్మడి జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలు
ఈ నెల 10న పోలింగ్, 14న లెక్కింపు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 937 మంది
ఆదిలాబాద్, నవంబరు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ నెల 10న పోలింగ్ జరుగనుండగా, 14న ఓట్లను లెక్కిస్తారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 937 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పుష్పరాణి బరిలో నిలిచారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రిసైడింగ్, పోలింగ్, జోనల్ అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు ఆదిలాబాద్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండగా, నాలుగు జిల్లాల అదనపు కలెక్టర్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 937 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరం, ఉట్నూర్ మండలం పరిషత్ కార్యాలయం, మంచిర్యాలలో పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరం, బెల్లంపల్లిలో ఎంపీపీ మీటింగ్ హాల్, నిర్మల్లో జిల్లా పరిషత్ కార్యాలయం, భైంసా మండల పరిషత్ కార్యాలయం, ఆసిఫాబాద్లో జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్, కాగజ్నగర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమకు అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలకు 12 మంది ప్రిసైడింగ్ అధికారులు, 12 మంది జోనల్ అధికారులు, 28 మంది పోలింగ్ అధికారులు, 12 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి 24 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గెలిచే అవకాశం లేనందున కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. 22 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్పరాణి పోటీలో నిలిచారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 937 మంది ఓటర్లు ఉండగా మున్సిపల్ కౌన్సిలర్లు 308, జడ్పీటీసీలు 65, ఎంపీటీసీలు 554, ఎక్స్ అఫిషియల్ సభ్యులు 10 మంది ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్కు చెందిన వారు 80 శాతం వరకు ఉన్నారు. ఫలితంగా పోటీ నామమాత్రంగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలు
ఎదులాపురం, నవంబర్ 30 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్త్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన పోలింగ్ అధికారుల శిక్షణకు కలెక్టర్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అసిస్టెంట్ కలెక్టర్లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. పోలింగ్ నిర్వహణ, రిపోర్టులకు సంబంధించిన అంశాలను సిబ్బంది పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ పేపర్ పరిశీలన, మెటీరియల్ స్వీకరణ, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, సిబ్బందికి విధుల కేటాయింపు, కంపార్ట్మెంట్ ఏర్పాటు, ఇతర అంశాలపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ పాల్గొన్నారు.
పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి గత సంవత్సరం 250వ ర్యాంకు రాగా, ఈ ఏడాది 10వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. వచ్చే సంవత్సరం మరింత మంచి ర్యాంకు వచ్చేందుకు ఇప్పటి నుంచే స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగానే విద్యార్థులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. పట్టణ సుందరీకరణ కోసం ఇప్పటికే రోడ్ల వెడల్పు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, చౌరస్తాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ప్రతాప్సింగ్, మున్సిపల్ ఈఈ వెంకటశేషయ్య, కౌన్సిలర్ ప్రకాశ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలన
జిల్లా కేంద్రంలోని రణదివే నగర్, గాంధీ నగర్లో చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో రాకపోకల సమస్య పరిష్కారానికి భారీ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు మడావి మంగళ, రామేశ్వర్, ప్రకాశ్ , మహేందర్ ఉన్నారు.