కొత్తగా అడవుల్లోని చెట్లను నరకవద్దు
గిరిజనులతో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నెన్నెల, నవంబర్ 30 : అర్హులైన పోడు రైతులకే పట్టాలు అందజేస్తామని, కొత్తగా పోడు పేరుతో అడవుల్లోని చెట్లను నరకవద్దని గిరిజనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. మంగళవారం నెన్నెల మండలంలోని కుశ్నపల్లిలో రెండురోజులుగా పోడు పేరుతో అటవీ భూమిలో ధర్నా చేపడుతున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. అటవీ భూమి లో చెట్లను నరుకుతుండడంతో సంబంధిత అటవీ, పోలీస్ అధికారులు ఇరవై మందిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రైతుల వద్దకు వచ్చారు. ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకున్న వారినే ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా పోడు సాగు పేరిట అడవుల్లోకి వెళ్లి చెట్లను నరకవద్దని కోరారు. గతంలో తాము చెట్లు కొట్టి సాగు చేశామని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు తమకు భూమి కాకుండా చేస్తూ అడ్డుతగులుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానన్నారు. ఇకపై అటవీ భూమి కబ్జాచేయవద్దన్నారు. ఎమ్మెల్యే వెంట కుశ్నపల్లి రేంజ్ అధికారి గోవింద్సింగ్ సర్దార్, రూరల్ సీఐ జగదీశ్, ఎస్ఐ రమాకాంత్ ఉన్నారు.
దరఖాస్తులను ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలి
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, నవంబర్ 30 : పోడు భూముల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తుల నమోదు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. మంగళవారం వాంకిడి మండల తహసీల్ కార్యాలయంలో దరఖాస్తులను ఆన్లైన్లో నమెదు ప్రకియను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ నమోదులో పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి తహసీల్దార్, సిబ్బంది ఉన్నారు.