ఆదిలాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో 5.72 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ తదితర పంటలు సాగవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు బాగా పడుతుండడంతోపాటు వాతావరణ పరిస్థితులు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. సెప్టెంబరు మూడో వారంలో సోయాబీన్, అక్టోబర్ చివరి వారంలో పత్తి దిగుబడులు ప్రారంభమవుతాయి. పంటల కొనుగోళ్లలో పారదర్శకత పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో సాగు వివరాలు సేకరిస్తున్నారు. 101 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ పంటలు వివరాలు నమోదు చేస్తున్నారు. వ్యవసాయ క్లస్టర్, రైతు పేరు, పట్టా, సర్వే నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, ఏ పంటను ఎన్ని ఎకరాల్లో వేశారనే విషయాలను తెలుసుకుని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. జిల్లాలో 1.47 లక్షల మంది రైతులు ఉండగా.. అందరి వివరాలు సేకరిస్తారమని అధికారులు తెలిపారు.
పకడ్బందీగా కొనుగోళ్లు
రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్నది. జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలైన మార్క్ఫెడ్, నాఫెడ్, ఆయిల్ఫెడ్, సీసీఐ ద్వారా పత్తి, కంది, సోయాబీన్, శనగ పంటలను కొనుగోలు చేస్తారు. లైసెన్స్ ఉన్న ప్రైవేట్ వ్యాపారులు వివిధ పంటలు సేకరిస్తారు. ప్రస్తుతం ఏఈవోలు సేకరిస్తున్న పంటల వివరాల వల్ల పలు రకాల ప్రయోజనాలు చేకూరనున్నారు. జిల్లాలో సాగువుతున్న మొత్తం పంటల విస్తీర్ణం పక్కాగా తెలుస్తున్నది. దీంతోపాటు ఆయా పంటల దిగుబడులు కూడా తెలుస్తాయి. ఈ వివరాల ప్రకారం రైతులు పంటల అమ్మకాల్లో ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. జిల్లాలో వివిధ పంటల సేకరణకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో ప్రణాళికలు తయారు చేస్తారు.
దళారుల దందాకు చెక్
గతంలో ప్రభుత్వం పంటల కొనుగోలు కేంద్రాల్లో దళారులు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వివిధ పంటలను విక్రయించి మద్దతు ధర పొందేవారు. దళారుల దందా కారణంగా నష్టపోకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పంటలు విక్రయించాలంటే ఏఈవోల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించారు. పంటల వివరాలను ఏఈవోలు ఆన్లైన్లో పొందుపరు స్తున్నారు. రైతులు సాగు చేసిన పంటల ఆధారంగా దిగుబ డిని అంచనా వేసి పత్రం ఇస్తారు. పంటల వివరాలు సేకర ణ వల్ల అసలైన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తున్నది.