టెహ్రాన్: దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య (Israel-Iran) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ (Hossein Amirabdollahian) ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీచేశారు. డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్లయితే తాము కూడా అంతకుమించి ప్రతిదాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాటి డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఇరాన్లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతంలోకి చొచ్చుకొచ్చినవి డ్రోన్లు కాదని, అవి పిల్లలు ఆడుకునే బొమ్మలు అంటూ ఎద్దేవా చేశారు. డ్రోన్ల దాడిని ఇజ్రాయెల్ చేసిన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, దీనిపై టెహ్రాన్ దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. ఇరాన్పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే తాము దానికి మించిన ప్రతిదాడులను చేస్తామని వెల్లడించారు. అలా కాకపోతే ఇక్కడితో ముగిస్తామన్నారు.
ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ఇరాన్ మిలటరీకి ప్రధాన ఎయిర్బేస్గా కూడా ఉంది. నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, ఆకాశంలో డ్రోన్లు కన్పించాయని, అయితే అవి దేనికో అర్థం కాలేదని స్థానికులు తెలిపారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉండటంతో ఇరాన్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడితో అప్రమత్తమైన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను మోహరించడమే కాక, గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్టు తెలిపింది. తాము జరిపిన దాడుల గురించి ఇజ్రాయెల్ మిలటరీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లోని గగనతలాన్ని మూసివేశారు. పౌర, వాణిజ్య విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని విమానాలను దారి మళ్లించగా, మరికొన్నింటిని వేరే విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చేశారు. దీంతో ఏం జరుగుతుంతో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. దుబా య్ కేంద్రంగా నడుస్తున్న ఎమిరేట్స్, ఫ్లయ్ దుబాయ్ సంస్థలు ఎలాంటి కారణం వెల్లడించకుండా పశ్చిమ ఇరాన్కు వెళ్లాల్సిన విమానాలను దారిమళ్లించాయి. కాగా, మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలపై యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.