ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకే
భైంసా, ఫిబ్రవరి, 18 : సహజ శక్తి వనరుల సంరక్షణకు కృషి చేస్తూ సౌర శక్తి వినియోగమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఐఐటీ బాంబే ప్రొఫెసర్, ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చేతన్ సింగ్ సోలంకే అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు, గాంధీగంజ్లో రైతులకు సౌరశక్తిపై అవగాహన కల్పించారు. విద్యుత్ శక్తి వనరులు విచ్చలవిడిగా వినియోగించడంతో భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికీ సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం రైతులు, విద్యార్థులకు బస్సులో సోలార్ శక్తి ద్వారా నడిచే పలు పరికరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసీఫ్, డా. రామకృష్ణ గౌడ్, తోట రాము, డా. దామోదర్ రెడ్డి, ఏఎస్పీ కిరణ్ ఖారే, ఎంఈవో సుభాష్, రమేశ్ మాశెట్టి వార్, మెంచు గంగయ్య, బచ్చువార్ మోహన్, రాజేశ్వర్, డా.నగేశ్, ప్రధానాచార్యులు దేవెందర్ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతమైన స్వరాజ్ ఎనర్జీ యాత్ర..
ముథోల్, ఫిబ్రవరి, 18 : ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ సమన్వయం చేసిన సోలార్ యాత్ర ముథోల్ మండల కేంద్రంలోని రబీంద్ర పాఠశాలలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చేతన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సోలార్ ఎనర్జీ మీద ఆధారపడాలని సూచించారు. దీంతో 30 శాతం కరంట్ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. అనంతరం చేతన్సింగ్ను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ సాయినాథ్, డైరెక్టర్ పోతన్నయాదవ్, కరస్పాండెంట్ రాజేందర్, కోఆర్డినేటర్లు ప్రశాంత్ మిశ్ర, కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.