ఎదులాపురం, సెప్టెంబర్23 : సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు.. ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణం, మావల పరిధిలోని 135 మందికి రూ.75.83 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పలు సంక్షేమ పథకాలు అమ లు అవుతున్నాయని తెలిపారు. గతంలో సైతం పాలించిన పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించాయని పేర్కొన్నారు. నిరుపేదల ఆడపిల్లల పెండ్లిండ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కోసం పింఛన్లు రైతుల కోసం రైతు బంధు ఇలా అన్ని వర్గాల వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు దేశంలోని బీజేపీ , కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.