ఎదులాపురం, డిసెంబర్ 21 : చైల్ట్ కేర్ ఇన్స్టిట్యూషన్లను సక్రమంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి, తనిఖీ కమిటీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్లో గల బాలసదన్, శిశు గృహాలను మంగళవారం జిల్లా తనిఖీ కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. ఈ మేరకు బాలసదన్, శిశు గృహాలలో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల గురించి సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రాజేంద్రప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లను నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు. ప్రతీ 3 నెలలకోసారి తనిఖీ చేస్తామని తెలిపారు. లోటు పాట్లు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ తరుఫున అవసరాలు, వసతులు కావాలన్నా తమకు తెలియజేయాలని సూచించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్కు తెలియజేస్తారని తెలిపారు. అనంతరం డీఐవో డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించాలని సూచించారు. పౌష్టికాహారం అందించాలన్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధచూపాలని సూచించారు. ఏ సమస్యలు ఉన్నా తమను సంప్రదించాలన్నారు. చిన్న పిల్లల వైద్యుడు వై తిరుమల్ రెడ్డి, చైల్డ్ లైన్ సిబ్బంది వైశాలి ఉన్నారు.