రూ.40.30 లక్షల విలువైన సరుకు స్వాధీనం
ముగ్గురిపై కేసు..పరారీలో ప్రధాన నిందితుడు
వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎదులాపురం,ఫిబ్రవరి 13 : జిల్లాలో రూ.40.30 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకోవడం ఇదే మొట్టమొదటి సారని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. రెండు రోజుల క్రితం మావల ఎస్ఐ ఈ సాయన్న , సిబ్బందితో కలిసి నిషేధిత గుట్కా ఉందనే విశ్వసనీయ సమాచారం మేరకు దస్నాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక గోడౌన్లో తనిఖీలు చేశామన్నారు. అక్కడ పెద్దపెద్ద బ్యాగుల్లో నింపి నిల్వ ఉంచిన రూ.40.30 లక్షల విలువైన గుట్కా లభించిందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.కోటి పైనే ఉంటుందన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఏ-1 షమీ ఉల్లాఖాన్(శమ్మూ), ఏ-2 అవాద్ భూషణ్ త్రిపాఠి, ఏ-3 మహ్మద్ అబ్దుల్ జుబేర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
దర్యాప్తులో నిందితుడు అవాద్ భూషన్ త్రిపాఠి, ప్రధాన నిందితుడైన శమ్మూ ద్వారా ఈ గుట్కాను కర్ణాటకలోని బీదర్లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. గుట్కాను కొంత కాలంగా మహ్మద్ అబ్దుల్ జుబేర్కు చెందిన గోడౌన్లో నిల్వ ఉంచి ఇక్కడి నుంచి చిరు వ్యాపారులకు సరఫరా చేస్తూ ఉండేవాడని విచారణలో తేలిందని పేర్కొన్నారు. నిందితుడు ఏ-3ని సంఘటనా స్థలంలోనే అరెస్టు చేశామని చెప్పారు. ఏ-1 షమీ ఉల్లాఖాన్, ఏ-2 అవాద్ భూషణ్ త్రిపాఠి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముగ్గురిపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మావల ఎస్ఐ సాయన్న, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో పటిష్టమైన సమాచార వ్యవస్థ ప్రజల సహకారంతోనే సాధ్యమవుతందన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని జిల్లా పోలీసులకు అందించాలని సూచించారు. పట్టణ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కే పురుషోత్తమాచారి, మావల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహేందర్, సిబ్బంది ఉన్నారు.
మరోచోట రూ.1.20 లక్షల విలువైన..
ఆదిలాబాద్ టూటౌన్ పరిధిలో స్థానిక గంజ్ రోడ్డులోని స్వస్తిక్ జిన్నింగ్లో రూ.1.20 లక్షల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నామని టూటౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాశ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. గంజ్ రోడ్డులోని స్వస్తిక్ జిన్నింగ్ మిల్లులో అక్రమంగా గుట్కా నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేశామని తెలిపారు. నిందితుడు చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ అయ్యూబ్కు సంబంధించిన రూ.1.20 లక్షల విలువైన నిషేధిత గుట్కా లభించిందని పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలో కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్ సింగ్, ఎంఏ కరీం పాల్గొన్నారు.