ఆదిలాబాద్ ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కుంటాల, అక్టోబర్ 26 : అన్నదాతల ఆత్మఘోషల వెనుక అసలు కారణాలు ఎన్నో ఉన్నాయి. పంట సాగు చేసి, దిగుబడి రాక, వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర రాక రైతు ప్రాణాలు తీసుకుంటున్నాడన్న మాటలు నేటి కాలంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర ప్రభుత్వాలు రాజ్యం చేసిన కాలంలో తెలంగాణపై వారి నిర్లక్ష్య పాలనతో గోదావరి జలాలు రైతుల పొలాల్లోకి రాకుండా పోయాయి. విద్యుత్ కోతలతో భూగర్భజలాలను వినియోగించుకునే పరిస్థితులు లేకుండాపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం కొనుగోళ్లు జరుపక, విద్యుత్ చార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు గతిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 1995 నుంచి 2004 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో నమోదు అయిన రైతు ఆత్మహత్యలు దేశంలోనే సంచలనం సృష్టించాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం తర్వాత ఎక్కువగా రైతు ఆత్మహత్యలు నమోదైంది. తెలంగాణ ప్రాంతంలోనే. తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్ర సాధన, తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తదుపరి రైతు మేలు కోసం తీసుకున్న చర్యలు క్రమంగా రైతులకు భరోసా ఇవ్వడం మొదలు పెట్టాయి. చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు నీటి గోస తీరింది. భూగర్భ జలాలను పొలాల్లోకి తీసుకునేందుకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను ఇవ్వడం మొదలు పెట్టారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జలకళ తీసుకొచ్చారు. రైతుబంధు పథకం ద్వారా రైతుకు పంట పెట్టుబడిని అందిస్తున్నారు. అలాగే రైతుకు బీమా సౌకర్యం కల్పించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తదుపరి లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశారు. 2018లో మరోసారి రైతు రుణమాఫీని ప్రకటించారు. అలాగే రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసే ప్రక్రియ దిగ్విజయంగా సాగుతోంది. దీనికి తోడు రైతుల కోసం రైతు వేదికలు, రైతుకల్లాలు, ఇతరత్ర అనేక సౌకర్యాలు, సబ్సిడీలు కల్పించారు. ఇన్ని చర్యలు తీసుకోవడంతో సేద్య రైతుల జీవితాలు తిరిగి గాడిలో పడ్డాయి. పదేళ్ల క్రితం వరకు బిక్క మొహం వేసి, వ్యవసాయం దండుగ అన్న రైతులు, నేడు వ్యవసాయం పండుగ అనే స్థాయికి వచ్చారు. రైతు ఆత్మహత్యలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే రైతుల మేలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకంలో క్లెయిమ్ అయిన కొన్ని ఆత్మహత్య కేసులను చూపుతూ, ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు రైతులు అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ప్రతిపక్షాలు, పత్రికల ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, పరువు సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్న వారికి కొంత వ్యవసాయ భూమి ఉండడం వారి మృతితో వారి కుటుంబ సభ్యులకు బీమా మొత్తం రావడంతో అన్ని ఆత్మహత్యలను రైతు ఆత్మహత్యల ఖాతాలో జమ చేస్తున్నారన్న విషయం తేటతెల్లమవుతున్నది.
రైతులకు వరంగా సర్కారు పథకాలు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు వరంగా మారాయి. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల పంపిణీ, పంటల కొనుగోళ్లలాంటివి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో పంట పెట్టుబడుల కోసం అప్పులు చేసే రైతులకు రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.10 వేలు ఉచితంగా అందుతున్నాయి. రైతులు ఏ కారణంగా మరణించినా రైతుబీమా పథకం వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. రూ. 5 లక్షలు రైతు కుటుంబసభ్యులకు అందుతున్నది. మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో సాగు నీరు పుష్కలంగా అందుతుండడంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు సమస్య కారణంగా చేతికి వచ్చిన పంటలను రైతులు నష్టపోవాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తున్నది. దీంతో పంటలకు అవసరమైనప్పుడు రైతులు నీటిని అందిస్తున్నారు. మండల వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ క్లస్టర్లో ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటూ పంటల సాగులో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పంటలు సాగులో భాగంగా రైతులు ట్రాక్టర్లతో పాటు ఇతర వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నది. గతంలో రైతులు ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలను కొనుగోలు చేసేవారు కాదు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు తమ పంటలను అమ్ముకోవాల్సి వచ్చేది. ఏడేళ్లుగా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్నది. అన్నదాతలకు రావాల్సిన డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది.
కుటుంబ కలహాలే..
కుంటాల, అక్టోబర్ 26 : ఈ చిత్రంలో ఉన్నది జాదవ్ జితేందర్. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల పంచాయతీ పరిధిలోని రాజాపూర్ తండా. ఇతడి పేరిట స్థానిక అటవీ సమీపంలో సర్వే నం. 113/అ..లో ఎకరం మూడు గుంటల భూమి ఉంది. రాళ్లు రప్పలతో కూడిన ఈ భూమిలో ఏటా పత్తి వేస్తారు. కుటుంబ సభ్యులే పంటను చూసుకుంటారు. ఇతడు కుభీర్ మండలం చాత, హల్దా, కుంటాల గ్రామాల్లో పలువురి వద్ద పదేళ్లుగా పాలేరుగా కొనసాగుతూ వచ్చాడు. ఈ క్రమంలో వ్యసనాలకు బానిసై యజమానుల వద్ద అప్పులు చేశాడు. సరిగా పనికి వెళ్లేవాడు కాదు. కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడే వాడు. కుటుంబ కలహాలకు తోడు ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది సెప్టెంబర్ 13న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించారు. రైతుబీమా లబ్ధిదారుడు కావడంతో ర్రూ.5 లక్షలు అందింది. సర్కారు సాయంతో అప్పులు తీర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ రాజాపూర్ గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించగా, ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.