ఆదిలాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా గిరిజనుల ఉపాధిని మెరుగుపర్చడంతో పాటు వ్యవసాయం, ఇతర రంగాల వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు సైతం రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా వారు జరుపుకునే పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. దీపావళి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దండారీ వేడుకలకు సైతం ప్రభుత్వం చేయూతను అందించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గూడేల్లో దండారీ వేడుకల కోసం రూ.కోటిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సోమవారం మంత్రి అల్లోల సమక్షంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మంజూరు పత్రాన్ని అందించారు. సర్కారు అందించిన సాయంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంప్రదాయాలకు సర్కారు పెద్దపీట..
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వారు జరుపుకునే పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసే అవకాశం లభిస్తున్నది. వీటితో పాటు ఆదివాసీ గూడేల్లోని వారి ఆలయాల నిర్మాణాలకు సైతం సర్కారు అవసరమైన సహాయాన్ని చేస్తున్నది. ఆదివాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయ పునర్నిర్మాణంతో పాటు భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేసింది. రూ.4.80 కోట్లతో ఆలయ పునర్నిర్మాణంతో పాటు రోడ్లు, దర్బార్హాల్, ఇతర పనులను చేపట్టింది. గిరిజనుల ఉపాధి, విద్యారంగాలకు సైతం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా గిరిజన విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో కార్పొరేట్ చదువులను అందిస్తున్నది.
దండారీకి రూ.కోటి మంజూరు..
ఏటా దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసులు దండారీ వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. వారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ దండారీ వేడుకల్లో గుస్సాడీల నృత్యాలు, మహిళల రేలా రే రేలా పాటలు, యువతీ యువకుల కోలాటం, డప్పుల మోత, గజ్జెల సవ్వడితో గూడేలు సందడిగా మారుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివాసులు బంధుత్వాలను పెంచుకోవడానికి ఒక గూడెం నుంచి మరో గూడేనికి పోతారు. ఒకరోజు బస చేసి సంప్రదాయ కోలాటం, గుస్సాడీ, రేలా రే రేలా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. దసరా తర్వాత ప్రారంభమయ్యే ఈ వేడుకలు దీపావళి అనంతరం కోలాబొడితో ముగుస్తాయి. జిల్లాలో ఈ ఉత్సవాలను ఆదివాసులు ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దండారీ వేడుకలకు రూ.కోటి నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. ప్రతి గూడేనికి రూ.10 వేల చొప్పున మంజూరుకాగా.. ఇందుకు సంబంధించిన డబ్బులను ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ పటేళ్లు, దండారీ బృందాలకు అందజేస్తారు. తాము ఎన్నో ఏళ్లుగా దండారీ ఉత్సవాలను జరుపుకుంటున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తమ సంస్కృతీ సంప్రదాయాలను గుర్తించలేదని, తెలంగాణ సర్కారు ప్రోత్సహించడమే కాకుండా నిర్వహణకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని ఆదివాసులు అంటున్నారు. సర్కారు అందించిన డబ్బులతో దండారీ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని చెబుతున్నారు.
సర్కారును మరిచిపోలేం..
నార్నూర్,అక్టోబర్ 19 : దండారీ ఉత్సవాలను గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నిధులిచ్చిన పాపానపోలేదు. ఎంత కష్టమైనా దండారీ ఉత్సవాలను నిర్వహించుకున్నాం. తెలంగాణ వచ్చినంక రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులు నిర్వహించే దండారీ ఉత్సవాన్ని గుర్తించి రూ.కోటి నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ప్రతి గూడేనికి రూ.10వేల ఆర్థికసాయం అందించడంతో దండారీ నిర్వాహకులకు ఆర్థికభారం తప్పుతుంది. ఈ సర్కారును జీవితంలో మరిచిపోలేం. నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు..
నార్నూర్, అక్టోబర్ 19 : ఆదివాసులు ఎంతో ప్రాధాన్యతతో నిర్వహించే దండారీ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రూ.కోటి మంజూరు చేయడం హర్షణీయం. ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. దండారీకి ప్రాధాన్యతను ఇస్తూ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గూడేనికి రూ.10 వేల చొప్పున కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషి చేశారు.