బోథ్ : గ్రామాల్లో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శుక్రవారం బోథ్లోని రైతు వేదిక భవనంలో ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ టీఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బాబెర, పిప్పల్ధరి, నాగాపూర్, నక్కలవాడ, పట్నాపూర్ గిరిజన గ్రామాలను ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేయించాలన్నారు.
శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, ఇతర అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లు చెల్లింపు కోసం గ్రామాల్లో ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తారన్నారు. సెప్టెంబర్ 27 నాటికి పూర్తయిన పనుల బిల్లులో 85 శాతం బిల్లులు వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయిస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి బోథ్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన గ్రామాల సర్పంచులు బీ శ్రీధర్రెడ్డి, పీ సుగుణ, కోవ సుమిత్రాబాయి, ఎస్ సురేశ్, కే విజయ్, పంచాయతీ కార్యదర్శులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, ఎంపీడీవో సీహెచ్ రాధ, ఎంపీవో జీవన్రెడ్డి, సూపరింటెండెంట్ సుధాకర్రెడ్డి, ఏపీవో శ్యాం, సర్పంచులు, ఎంపీటీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, జీపీల కార్యదర్శులు పాల్గొన్నారు.