ఇంద్రవెల్లి, అక్టోబర్ 26: ఏజెన్సీలోని మారుముల గ్రామాలకు చెందిన గిరిజన యువత చదువుల్లో ముందుండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. మండలంలోని వాల్గొండ, హిరాపూర్లో ఇంద్రవెల్లి ఎస్ఐ నాగ్నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. గిరిజన మహిళల ఆధ్వర్యంలో రాజేశ్చంద్రతోపాటు ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమెత మనోహర్కు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఎస్పీ మాట్లాడారు. గిరిజనులు ఆరోగ్యంపై దృష్టి సారించి మెరుగైన వైద్యం పొందాలన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గిరిజన యువతకు పోలీస్ ఉద్యోగంపై ప్రత్యేక శిక్షణ కల్పిస్తామన్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన రోగులతో మాట్లాడి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ సైదారావ్, ఎస్ఐ నాగ్నాథ్, సర్పంచ్లు నాగోరావ్, జుగాదిరావ్, హిరాపూర్ గ్రామ పటేల్ తొడసం ఇస్రుపటేల్, గిరిజన నాయకులు సిడాం భీంరావ్, కనక తుకారాం, ఆర్కా ఖమ్ము, తొడసం నాగోరావ్, ఆత్రం మారుపటేల్, లచ్చుపటేల్, సోయం రామ్దాస్, జుగ్నాక్ భరత్, తొడసం మారుతి, తొడసం హరిదాస్, ఆత్రం ధర్ము, పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు.
మెగా వైద్య శిబిరానికి స్పందన
హిరాపూర్ గ్రామంలో ఇంద్రవెల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి గిరిజనుల నుంచి భారీ స్పందన లభించింది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు వైద్య శిబిరానికి తరలివచ్చారు. రిమ్స్ వైద్యులతోపాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల వైద్యులు గిరిజనులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో కుడిమేత సాధన, వైద్యులు దీపక్ పుస్కర్, రమేశ్ పవార్, ధన్రాజ్ ఆగర్వాల్, అరవింద్, శ్రీకాంత్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లాగ్ డే సందర్భంగా సైకిల్ర్యాలీ…
తాంసి, అక్టోబర్ 26: పోలీసు అమరవీరుల సంస్మరణ, ఫ్లాగ్డే సందర్భంగా బుధవారం ఉదయం 7 గంటలకు భారీ సైకిల్ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఔత్సాహికులు ఎవరి సైకిల్ వారు తెచ్చుకోవాలని సూచించారు.
పోలీసులకు వ్యాసరచన పోటీలు
ఫ్లాగ్ డే సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ ఏఆర్హెడ్క్వార్టర్లో కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి వరకు 3 కేటగిరీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సాయుధ పోలీసులకు జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర అనే అంశంపై ఈ పోటీలు నిర్వహించారు. అదనపు ఎస్పీ వినోద్కుమార్ పర్యవేక్షించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బీ శ్రీపాల్, కే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.