మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఎమర్జెన్సీ కిట్లు అందజేత
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 26: కరోనా సమయంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కార్మికులకు డ్రెస్, హెల్మెట్, గ్లౌస్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషించే పారిశుధ్య కార్మికులకు ఎమర్జెన్సీ కిట్ను అందజేశామని తెలిపారు. కరోనా విస్తరిస్తుండడంతో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజాని, కమిషనర్ శైలజ, అసిస్టెంట్ కమిషనర్ రాజు, కౌన్సిలర్లు సంద నర్సింగ్, గణేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
పట్టణంలోని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీనగర్లో రూ.10లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదన్నారు. దీంతో పట్టణ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రిగా ఉన్నప్పుడు గాంధీనగర్ అభివృద్ధికి రూ.6కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి, కౌన్సిలర్లు మంజుల, సంద నర్సింగ్, నాయకులు రామేశ్వర్, మోసిన్ పాల్గొన్నారు.