బోథ్, సెప్టెంబర్ 28: జిలాలలో సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం కొనసాగింది. బోథ్ మండలంలో 82.08 మిల్లీ మీటర్లుగా నమోదైంది. పెద్దవాగు, ధన్నూర్ (బీ), నక్కలవాడ, అందూర్, రఘునాథ్పూర్, సొనాల, చింతల్బోరి, కోటా (కే), సాంగ్విలోని వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ధన్నూర్ (బీ), నక్కలవాడ వంతెనల వద్ద గ్రామస్తులు, సర్పంచ్లు, పోలీసులు కాపలాగా ఉన్నారు. పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కింది.
సాత్నాల గేట్లు ఎత్తివేత…
మండలంలోని సాత్నాల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. అధికారులు రెండు గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 286 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1149 క్యూసెక్కులు ఉంది.
మత్తడి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత…
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెట్టారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 277.05మీటర్ల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2071 క్యూసెక్కులు ఉండగా… 3005 క్యుసెక్కుల అవుట్ఫ్లో ఉందని ఏఈ చెంచుబాబు తెలిపారు.
లోతట్టుప్రాంతాలు జలమయం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద వచ్చి చేరుతున్నది. మండలకేంద్రంలోని చెరువులోకి భారీగా వరద చేరుతున్నది. ఇచ్చోడ-సోనాల వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కల్గింది. ఎస్ఐ ఉదయ్కుమార్, ట్రాన్స్కో అధికారులు చెట్టును తొలగించి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చూశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కూన గంగాధర్ పేర్కొన్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్గంగ
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. గుబ్డి, అంతర్గాం, గోముత్రి, వడూర్, గొల్లగఢ్, తాంసి(కె) శివార్ల సమీపం నుంచి పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ వాసులు మండలకేంద్రం, జిల్లా కేంద్రానికి, ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
బేల,సెప్టెంబర్ 28 : సోయా పంట ఆశాజనకంగా ఉన్న సమయంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
ఉట్నూర్, సెప్టెంబర్28: మండలంలో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ సతీశ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మండలంలోని గంగన్నపేట్, లక్కారం, ఉట్నూర్లోని గోపాయి, ఎల్లమ్మ, నాగాపూర్, దంతన్పెల్లి, బీర్సాయిపేట్ చెరువులు నిండి మత్తడి నుంచి దిగువకు నీరు పోతున్నది.
ఎడతెరిపి లేకుండా వర్షం కుర వడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఉమ్మడి మండలంలోని కుని కసా, మారుగూడ, బారిక్రావ్గూడ, చిత్తగూడ, దన్నుగూడ వాగులు, ప్రధాన రహదారుల్లోని హాగావ్, ఖడ్కి, లోకారి (కే) పూనగూడ, మలంగి అర్జుని కొలాంగూడ సమీపంలోని లోతట్టు కల్వర్టులపై నుంచి వరద ప్రవహించింది.
ఇంద్రవెల్లిలో కుండపోత
మండలంలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో మామిడిగూడ, జైత్రం తండా, జెండాగూడ, చిత్తబట, వడగాం, వాల్గొండ, సట్వాజీగూడల వాగులు ఉప్పొంగాయి. జైత్రంతండా, జెండా గూడ, చిత్తబట, మామిడిగూడ గ్రామాలకు రాకపో కలు స్తంభించాయి. రైతులు వ్యవసాయ పనులతోపాటు పశువులను మేపేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కంట్రోల్రూం ఏర్పాటు..
భారీవర్షాల కారణంగా పట్టణంలో వరద బాదితులను ఆదుకునేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎస్ఈ వెంకట శేషయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా కంట్రోల్ రూం నంబర్లు 9948928368, 7989959286, 9985900369 లలో సంప్రదించాలన్నారు. అవసరమైన సహాయసహకారాలు అందిస్తామన్నారు. మరో వైపు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అర్బన్ తహసీల్దార్ భోజన్న ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.