మూడు ముళ్లతో ఏకమైన ప్రేమజంట
నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కథనం
మంచిర్యాల, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : ఇద్దరికీ తెలంగాణ అంటే వల్లమాలిన అభిమానం. ఆమె ఉద్యమ పంథాలో మహిళలకు మనోధైర్యాన్నిస్తుంటే.. ఆయన సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తూ చైతన్య పరుస్తుంటాడు. తెలంగాణ ఉద్యమ పోరాటంలోనూ ఇరువురూ ప్రత్యేక పాత్ర పోషించారు. మనసులు కలిసి, మనువు చేసుకున్నారు. వారే నిషా-లెనిన్లు. వీరిపై నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నిషా, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన లెనిన్లు ఈ మధ్యనే ప్రేమవివాహం చేసుకున్నారు. నిషా సాధారణ కుటుంబానికి చెందిన మహిళ. గాంధీ దవాఖానలో నర్సింగ్ విద్య పూర్తి చేసి.. తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించింది. నర్సులు, మహిళలను పలు అంశాలలో చైతన్య పరుస్తూ ప్రత్యేకతను చాటుకున్నది. ఉద్యమ సమయంలో తన వాయిస్తో సమాజ పోకడను వివరిస్తూ ప్రజలను తెలంగాణ ఆకాంక్ష వైపు ఆకర్శితులను చేసింది. ఇదిలా ఉంటే లెనిన్ ఉస్మానియాలో ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ చేస్తూ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అభివృద్ధి పథకాలను వివరిస్తూ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను నెటిజన్లకు తెలుపుతున్నాడు. ప్రతిపక్షాలపై సెటైరికల్ పోస్టులు పెడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ ఇద్దరి మనసులు కలిసి ఒక్కటయ్యారు. బంగారు తెలంగాణలో తాము భాగస్వామ్యం కావాలన్నదే తమ లక్ష్యమని వారు పేర్కొంటున్నారు.
ట్వీట్తో ప్రత్యేక గుర్తింపు..
నిషా సమాజంలో జరుగుతున్న ఇబ్బందులను అధికారులకు వివరిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నది. ‘రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు మహిళల అవసరాల నిమిత్తం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం పెట్రోల్ బంక్లలో పది నిమిషాలు బస్సులు ఆపితే సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఎటువంటి భారం ఉండదు.’ అని నిషా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఇటీవల ట్వీట్ చేసింది. ఆయన సత్వరమే స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు వాష్రూం సదుపాయం వినియోగించుకునేలా ఆయా బస్సు రూట్లలోని పెట్రోల్ బంక్ల వద్ద పది నిమిషాలపాటు బస్సులు ఆపేలా ఆదేశాలు జారీ చేశారు.