కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రాకున్నా.. తామున్నామని భరోసా..
కొవిడ్ మృతుల అంత్యక్రియలకు పూర్తిస్థాయిలో సహకారం
అందరి మన్ననలు పొందుతున్న మానవతావాదులు
దండేపల్లి, మే 4 : “ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం విధి లీలా.. వెంట ఏ బంధము.. రక్త సంబంధము.. తోడుగా రాదుగా తుది వేళా.. మరణమనేది ఖాయమని.. మిగిలెను కీర్తి ఖాయమని.. నీ బరువు.. నీ పరువు మోసేది.. ఆ నలుగురు..” కానీ.. ఈ కరోనా సమయంలో ఆ నలుగురు కూడా కరువయ్యారు. కనీసం పాడె కట్టేవారు, మోసేవారు, చితి పేర్చేవారు, గుంతలు తీసేవారు ముందుకురావడం లేదు. రక్తసంబంధీకులు, ప్రాణ స్నేహితులు, బంధువుల మధ్య జరగాల్సిన అంత్యక్రియలు అనాథలా జరుగుతున్నాయి. చివరకు అయినోళ్లు కాకుండా అంబులెన్స్ డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మున్సిపల్, జీపీ సిబ్బంది అన్నీతామై చివరి క్రతువు పూర్తి చేస్తున్నారు. ఇటువంటి మానవతా వాదుల సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
కొవిడ్-19 ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. గత మార్చిలో మన వద్ద ఫస్ట్ వేవ్(తొలి దశ) ప్రారంభం కాగా.. ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అప్పుడు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం చేశారు. వాడలు, ఊర్లు, పట్టణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. సర్కారు కూడా ట్రేసింగ్, టెస్ట్, ట్రీట్మెంట్ కూడా పక్కా ప్రణాళిక ప్రకారం అందించింది. పాజిటివ్ వచ్చిన వారికి ధైర్యం అందిస్తూ, వైద్యులను ఇంటింటికీ పంపించి మెరుగైన వైద్యం అందించింది. కరోనా కిట్లు కూడా పంపిణీ చేసింది. అన్ని రకాల సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించి, వైద్యం అందించింది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామంటూ ముందుకుసాగడంతో పెద్దగా ముప్పు వాటిల్లలేదు. అన్నీతానై ముందుకురావడంతో ప్రాణనష్టం కూడా తక్కువగా జరిగింది.
విశృంఖలంగా రెండో వేవ్..
కరోనా సెకండ్ వేవ్(రెండో ఉధృతి) తుఫానులా వచ్చి పడింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకునేంతలోపే విరుచుకుపడింది. సామాజిక వ్యాప్తి చెందడంతో పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర సర్కారు ఏమరుపాటుగా ఉండి చర్యలు తీసుకోకపోవడంతో కొంత ప్రాణనష్టం జరిగినా.. రాష్ట్ర సర్కారు ముందస్తుగా దవాఖానల్లో అన్ని మందులు, పరికరాలు, ఆక్సిజన్, సిబ్బంది, వసతులు కల్పించింది. వాయువేగంతో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ చేస్తున్నది. వైద్య సిబ్బంది, కళాజాత బృందాలతో ఎప్పటికప్పుడు సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నది. ధైర్యం చెడొద్దని, సమయానికి మందులు వాడుతూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను జయించాలని ప్రచారం నిర్వహిస్తున్నది. వయసుపైబడిన వారు కరోనాను విజయవంతంగా జయిస్తున్నారని చూపిస్తున్నది. కొందరు ఏమరుపాటుగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. అయినప్పటికీ కొందరు చనిపోతున్నారు.
మోగని చావు డప్పు.. పాడే మోసేవారు కరువు..
సాధారణంగా ఎవరైనా చనిపోయినపుడు ఊరూవాడా ఏకమై తండోపతండాలుగా చూడడానికి వస్తారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు కారుస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య పాడె సిద్ధం చేస్తారు. ముందు ఇద్దరు, వెనకాల ఇద్దరు ఉండి దారి పొడువునా పాడె చేతులు మారుతూ మోస్తారు. రక్తసంబంధీకులు, స్నేహితులు తలా ఓ చేయి వేసి సంస్కారాలు పూర్తి చేస్తారు. ప్రస్తుతం కరోనా భయంతో చావు డప్పుకొట్టడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ఖననం చేయడానికి గుంత తీయడం, పాడి పేర్చడానికి కూడా మనుషులు దొరకడం లేదు. జేసీబీలతోనే గుంతలు తీసి అంత్యక్రియలు కానిచ్చేస్తున్నారు. చాలా మంది దవాఖానల్లో మృతిచెందితే ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో అంబులెన్స్లు, వైకుంఠ రథాలతోనే పార్థివ దేహాలను తీసుకెళ్లి అత్యంత దయనీయ పరిస్థితుల మధ్య దహన సంస్కారాలు కానిచ్చేస్తున్నారు.