అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానం
ఉమ్మడి జిల్లాలో 51 కొత్త ఫిజియో మీటర్ల ఏర్పాటు
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా రూ.3.10 కోట్లు విడుదల
నిర్మల్ టౌన్, మార్చి 30 : ప్రతి సంవత్సరం కేంద్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో నీటి లెక్కింపు నిర్వహిస్తుండగా.. ఈ సంవత్సరం నుంచి ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇందుకు అన్ని జిల్లాల్లో అదనపు ఫిజియోమీటర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా 51 ఫిజియో మీటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఫిజియో మీటరుకు రూ.6 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ లెక్కన 51 మీటర్లకు రూ.3.10 కోట్ల విడుదల కావడంతో ఫిజియో మీటర్ల ఏర్పాటు ప్రక్రియ జోరుగా సాగుతున్నది. సరాసరిగా 149 టీఎంసీల భూగర్భజలాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వీటిలో 50శాతం నీటి వృథా అవుతుండగా.. మిగతాది సాగు, తాగునీటికి వినియోగిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 51 మీటర్లు..
భూగర్భజలాల పరిరక్షణలో భాగంగా నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 51 ఫిజియో మీటర్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో 17 పాత ఫిజియో మీటర్లుండగా.. మరో 25 పెంచారు. మంచిర్యాల జిల్లాలో 18కి ఉండగా, ఆరు , కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 22 ఉండగా.. పది, ఆదిలాబాద్ జిల్లాలో 15 ఉండగా.. పది చొప్పున ఫిజియో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. భూగర్భజలాల శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భజలాలను లెక్కిస్తూ నికర జలాలు, ఖర్చయిన జలాల వివరాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మండలాలను గుర్తించి ఒక్కో మండలంలో 2-3 ఫిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భజలాలను పక్కగా లెక్కించనున్నారు. గతంలో ఆయా జిల్లాల్లో ఫిజియోమీటర్లు ఉండగా.. గతేడాది అన్ని జిల్లాల్లో డిజిటల్వాటర్ లెవల్ రికార్డు (డీడబ్ల్యూఎల్ఆర్) పరికరాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్మల్లో 16, మంచిర్యాలలో 12, ఆదిలాబాద్లో 13, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 18 మీటర్లను ఏర్పాటు చేసి పక్కాగా లెక్కింపు చేపడుతున్నారు. ఇక నుంచి ప్రతిరోజూ ఆరు గంటలకోసారి భూగర్భజలాల లభ్యతను లెక్కించవచ్చు. గతంలో ఏర్పాటు చేసిన ఫిజియో మీటర్లతో ప్రతినెలా చివరి వారంలో భూగర్భజలాలను లెక్కించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సాప్ట్వేర్ డిజిటల్ వాటర్ లెవల్ రికార్డులను ఉపయోగించుకొని ప్రతి మూడు గంటలకోసారి ప్రత్యేక యాప్ ద్వారా ఇంటర్నెట్ సాయంతో కంప్యూటర్కు మెస్సేజ్ వస్తుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫిజియో మీటర్ల కోసం ఇప్పటికే బోర్ల తవ్వకాలను చేపట్టారు. ఇక్కడ డీడబ్ల్యూఎల్ఆర్ మిషన్, కంప్యూటర్ మీటర్ తదితరవి అమర్చుతున్నారు. దీన్ని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఫిజియో మీటర్ల వద్ద సెల్ఫోన్ సిగ్నల్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వినియోగం మాత్రం నికర సామర్థ్యంతో పోల్చితే 37శాతం లోపే వినియోగించుకుంటున్నారు. వినియోగం 50శాతం పెరిగితే అక్కడ డాట్గా ప్రకటించి బోర్ల తవ్వకానికి అనుమతులు ఇవ్వకుండా ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని భూగర్భజలశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్బాబు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చుడండి
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ
ఏప్రిల్ 3 వరకు యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు