ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 22 : ఆదివాసీ సంప్రదాయాలు చాలా గొప్పవని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. మండంలోని నర్సాపూర్(జే), ఘన్పూర్, ఆడగూడ, తేజాపూర్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఆయన హాజరై గుస్సాడీ నృత్యాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులు ఎంతో పవిత్రమైన దండారీ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా గుస్సాడీలకు రూ.10 వేలు చొప్పున అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపటేళ్లు, సర్పంచ్లు, దేవరీలు, గిరిజనులు, గుస్సాడీలు, తదితరులు పాల్గొన్నారు.
తాంసి, అక్టోబర్ 22 : మండలంలోని గిరిగాం, అంబుగాం, అట్నంగూడ, బేతల్గూడ, రాంనగర్ గ్రామాల్లో గుస్సాడీ సంబురాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లోని యువకులు, పెద్దలు, మహిళలు ఒక చోట చేరి నృత్యాలు చేశారు. తమ కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు.
సిరికొండ/ఇచ్చోడ, అక్టోబర్ 22 : సిరికొండ మండలంలోని రిమ్మ, కుంటగూడ, రాయిగూడ, ఇచ్చోడ మండలంలోని దోబిగూడ, కొసుగూడ, బొద్దిగూడ గ్రామాల్లో దండారీ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆదివాసులు, గుస్సాడీలు వారి ఆర్యాధ దైవాలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. గిరిజనుల గుస్సాడీ వేషధారణ, నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామస్తులు లక్ష్మీకాంత్, యాదవ్ రావ్, కైలాస్, యువకులు పాల్గొన్నారు.
నార్నూర్, అక్టోబర్ 22 : నార్నూర్, గాదిగూడ మండలాల్లోని ఆదివాసీ గూడేల్లో దండారీ సంబురాలు వైభవంగా కొనసాగతున్నాయి. గంగాపూర్, బలాన్పూర్, భీంపూర్, గూడలతో పాటు ఆదివాసీ గూడేల్లో గుస్సాడీ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మాన్కాపూర్, ఖైరదాట్వ, చిత్తగూడ గ్రామాల గుస్సాడీలు, గ్రామపెద్దలు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి వెళ్లారు. ఆదివాసీ మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ గ్రామపెద్దలు పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 22 : జైనథ్ మండలంలోని బెల్లరిగూడలో గిరిజనులు దండారీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గుస్సాడీ వేషధారణలో యువకులు కోలాటలు ఆడుతూ సంప్రదాయ పాటలు పాడుతూ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో సర్పంచ్ కిషన్, ఎంపీటీసీ రాంరెడ్డి, గ్రామ పెద్దలు భీంరావ్, ఉద్దవ్, కిష్టు, ధర్ము, మోతీరాం, తదితరులు పాల్గొన్నారు.