హైదరాబాద్, సెప్టెంబర్ 14 : మహిళా లోకాన్ని చైతన్య పరచండి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. మహిళల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ఆయనకు అండగా నిలవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జిల్లాల మహిళా సమాఖ్య పదాధికారుల సమావేశం హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని టిఎస్ ఐఆర్డిలో గురువారం జరిగింది.
ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాల సమాఖ్యల పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందనలు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో మహిళా సంఘాలు బలోపేతమైనట్లు చెప్పారు. తెలంగా ణలోని ఆడబిడ్డలు దేశంలోని మహిళలందరికంటే ముందున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు అందిస్తున్నాం.
బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. ఇలా అన్ని రంగాల్లో ముందున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని మంత్రి మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ సీఈవో గౌతం, స్పెషల్ కమిషనర్ ప్రదీప్, ఎస్బీఎం డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.