హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు సర్వ సిద్ధమయింది. సోమవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాలని ఇంటర్బోర్డు సూచించింది. కరోనా కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు జరగని విషయం తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,228 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కోసం 1,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం జరగనున్న సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్-ఏ ప్రశ్న పత్రాన్ని ఖారారు చేశారు.
కాగా, పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. ఈ సంవత్సరం కూడా నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే అనుమతిస్తామని, సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
మొదట విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లను ఇస్తారు. వాటిని 9 గంటల్లోపు పూరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాయాలి. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు.