కొద్ది సంవత్సరాల క్రితం వరకూ తల్లిపాల పట్ల అవగాహన తక్కువ. కృత్రిమ పాలు కూడా తల్లిపాలంత శ్రేష్ఠమైనవేనంటూ అబద్ధపు ప్రకటనలు గుప్పించేవారు. వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ ఆ భ్రమలు తొలగిపోయాయి. నిజానికి స్తన్యానికి అతి దగ్గరగా ఉండేది గాడిదపాలే! ఆవుపాలకు ప్రాధాన్యం పెరగకముందు అనేక దేశాలలో మేక, ఒంటె,గాడిద పాలను పిల్లలకు ఇచ్చేవారు. ఆవుపాలకు ఇంత ప్రచారం రావడానికి కారణం పాశ్చాత్య ప్రపంచమే.
ఆయా దేశాలలో ఆవులను వెన్న, జున్ను, పాలకోసం పెంచుతుంటారు. ఆవులు సాధు జంతువులు. మచ్చిక సులభం. కొంచెం దాణాతో బతికేస్తాయి. పాలు పితకడానికి అనువుగా ఉంటాయి కూడా. పాలలో ఏడురకాల ప్రధాన పదార్థాలు ఉంటాయి. అవి.. 1.నీరు, 2.మాంసకృత్తులు (ప్రొటీన్లు), 3.కొవ్వు పదార్థం,4.కార్బొహైడ్రేట్లు, 5.ఖనిజ లవణాలు, 6.విటమిన్లు.7. రోగ నిరోధక పదార్థాలు. కుందేలు పాలలో ప్రొటీన్లు 14 శాతం ఉంటే, తల్లిపాలలో ఆ వాటా 1.1 శాతమే. కాబట్టే, పుట్టిన ఆరు రోజులలో కుందేలు పిల్ల బరువు రెండింతలు పెరుగుతుంది. మనుషుల్లో అందుకు 140 రోజులు పడుతుంది. తల్లిపాలలో ప్రొటీన్లు తక్కువ, మాంసకృత్తులు తక్కువ, కార్బొహైడ్రేట్లు మాత్రం ఎక్కువ. దీనిని ఆధారంగా చేసుకొని ఆవుపాలకు వివిధ ప్రక్రియల ద్వారా మార్పులు, చేర్పులు చేసి తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ప్రవేశపెట్టారు. కానీ, ఇవేవీ సరైన ఫలితాలను ఇవ్వకపోవడమేగాక ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. తల్లి పాలు.. తల్లిపాలే! తల్లి ప్రేమ.. తల్లి ప్రేమే!
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు