జీవితంలో ఒక్కోసారి అన్ని దారులూ మూసుకు పోయినట్టే అనిపిస్తుంది. ఆ సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్తదారిని కనిపెట్టగలగాలి. ఇలాంటి పరీక్షల్ని బాల్యంలోనే ఎదుర్కొన్నది జ్యోతి. దారి లేని చోట దారులు నిర్మించింది. అక్షరాలే ఆమె ప్రయాణంలో వెలుగు రేఖలు అయ్యాయి.
రెండు జడలు, స్కూల్ యూనిఫాం, అమ్మచేతి వంట, నాన్న గారాబం.. అందరిలా ఆమెకూడా స్కూల్కు వెళ్లింది. కానీ, బడీడు వయసంతా ఆలాగే సాగలేదు. ఆ బుడిబుడి అడుగులు 8వ తరగతితోనే ఆగిపోయాయి. తర్వాత, తండ్రి అనారోగ్యం కారణంగా పాఠశాలకు వెళ్లలేక పోయింది. కానీ, తనకు చదువంటే ఇష్టం. చదివించాలన్నది తల్లిదండ్రుల కోరిక కూడా. చదువు రావాలంటే బడికే వెళ్లాలా? కన్నవారిని మించిన గురువులు ఎక్కడుంటారు? అందుకే, అమ్మానాన్నలే గురువులయ్యారు. జ్యోతికి ‘హోం స్కూలింగ్’ అలవాటు చేశారు. ఇలా 10వ తరగతి వరకూ ఇంట్లోనే చదివింది. అంతలోనే ఓ విషాదం. నాన్న మరణించాడు. అయినా, గుండె
నిబ్బరంతో ఇంట్లోనుంచే ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చేసింది. తర్వాత హైదరాబాద్కు వచ్చేసింది. నగరంలోని ఓ డిగ్రీ కాలేజీలో చేరింది. జ్యోతిది రంగారెడ్డి జిల్లా తాండూరు. హోం స్కూలింగ్ కావడంతో స్నేహితులు తక్కువ. తన మనసులోని భావాల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. దీంతో అక్షరాలకు దగ్గరైంది. ఆన్లైన్ వేదికలమీద మనోభావాలను రాయడం ప్రారంభించింది. కుటుంబం, సమాజం.. అన్నీ జీవితానుభవ పాఠాలే. ఇంగ్లిష్లో పేర్చుకుంటూ ముందుకు వెళ్లింది. మొదట అవి వచనాలే. తర్వాత కవిత్వాలయ్యాయి. ఆపై కథలుగా రూపాంతరం చెందాయి. వాటికి అనేక స్పందనలు వచ్చాయి. అవి ధైర్యాన్నిచ్చాయి. అప్పుడే, మరింత రాయాలని నిర్ణయించుకుంది జ్యోతి. వెబ్ జర్నల్స్కు, మ్యాగజైన్లకు ఆర్టికల్స్ రాసింది. కాలమిస్ట్గా మారింది. ‘Sensation of a Soul’ పేరుతో చిన్న కథలు, కవిత్వం కలిపి పుస్తకం ప్రచురించింది. దీనికీ మంచి స్పందన వచ్చింది. తర్వాత వరుసగా అనేక పుస్తకాలు తెచ్చింది. తాజా రచన ‘అనామిక’ (2020). ఉద్వేగాలు, ప్రేమ, ఒత్తిడి, కలలు, యువతరం తీరుతెన్నులు, అమ్మాయిల శక్తి, మానవ సంబంధాలు.. ఇలా మనిషి చుట్టూ తిరిగే వస్తువులనే ఎంచుకున్నది. చిన్న వయసులోనే నలుమూలల నుంచి పాఠకులను సంపాదించింది. ప్రస్తుతం ‘The Awakening’ పేరుతో కొత్త రచన ప్రారంభించింది. ‘నేనో రచయిత్రిగా ప్రపంచానికి పరిచయమయ్యాను. చాలా ఆనందంగా ఉంది. కానీ, నాన్న లేకపోవడమే ఓ పెద్ద వెలితి’ అంటున్నది జ్యోతి.