అక్టోబర్ 29. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 35 మంది మహిళలు సైనికాధికారులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో రిగ్జిన్ చొరోల్ లద్దాక్ నుంచి సైన్యంలో చేరుతున్న తొలి మహిళా అధికారి. హర్వీన్ కౌర్ గతంలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు. ఇద్దరి జీవిత భాగస్వాములూ బతికున్న రోజుల్లో వీర సైనికులే.
రిగ్జిన్ చొరోల్ లద్దాక్ వాసి. ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆమె భర్త రిగ్జిన్ ఖండప్ మూడో బెటా
లియన్లో రైఫిల్మాన్. విధులు నిర్వర్తిస్తూ గుండె పోటుతో మరణించారు. ‘నా భర్తకు నేను ఆర్మీ అధికారి కావాలని కోరిక. మహిళ అయితేనేం, నన్నూ సైన్యంలో చేరమని ప్రోత్సహించేవారు. ఆయన కల నిజం చేయడానికే యూనిఫామ్ ధరించాను’ అని ఉద్వేగంగా చెబుతారామె. లద్దాక్ నుంచి సైన్యంలో చేరుతున్న తొలి మహిళా అధికారిగా చొరోల్ రికార్డు సృష్టించారు. శిక్షణ సమయంలో దాదాపు పదకొండు నెలలు తన బిడ్డకు దూరంగా ఉన్నారు. ‘ప్రతిక్షణం నా కొడుకు గుర్తొచ్చేవాడు. కానీ బంధాల కంటే కర్తవ్యం గొప్పది కదా!’ అంటారామె. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్మీకి చెందిన సోషల్ మీడియా గ్రూప్ చొరోల్ను‘వీరనారి’గా అభివర్ణించింది. పంజాబ్కు చెందిన హర్వీన్ కౌర్ కూడా సైన్యంలో అధికారిగా చేరబోతున్నారు. ఆమె భర్త కెప్టెన్ కన్వల్పాల్ సింగ్ కహ్లోన్ మరణించే సమయానికి హర్వీన్ జలంధర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ‘బాల్యం నుంచీ సైన్యంలో చేరాలని ఉండేది. నా భర్త కూడా ప్రోత్సాహం అందించారు. కానీ అంతలోనే..’ అంటూ గతాన్ని నెమరేసుకుంటారు హర్వీన్. నైజీరియా సహా వివిధ దేశాలకు చెందిన 28 మంది మహిళలు కూడా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.
వీరనారులూ విజయీభవ!