ఒకప్పుడు కుర్రకారు కలల కథానాయిక.. నిషాకళ్ల నిరోషా. ఇప్పుడేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్నతెర మీద తల్లి, అత్త పాత్రలతో అలరిస్తున్నది. నిర్మాతగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నది. జీ తెలుగు ‘దేవతలారా దీవించండి’ సీరియల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్న నిరోషా ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
బాల్యం నుంచీ నటన అంటే ప్రాణం. స్కూలు, కాలేజీ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. మా ఇంట్లో వాళ్లంతా నేనే సినిమాల్లోకి వెళ్తానని అనుకున్నారు. కానీ అక్క (రాధికా శరత్ కుమార్) నాకంటే ముందే పరిశ్రమలోకి వచ్చింది. దీంతో నేను అవకాశాల కోసం కష్టపడాల్సిన అవసరం రాలేదు. నిజానికి నా తొలి సినిమా చాన్స్ కూడా అనుకోకుండా వచ్చిందే. అక్క డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మణిరత్నంగారు నన్ను నటించమన్నారు. అలా పదిహేడేళ్లకే హీరోయిన్ అయ్యాను. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించాను.
ఎంతో ప్రత్యేకం..
మా కుటుంబానికి తెలుగు పరిశ్రమ చాలా ప్రత్యేకమైంది. అక్క బాలీవుడ్ అగ్రహీరోలందరితో నటించింది. అలా వాళ్లంతా నాకు పరిచయం అయ్యారు. దీంతో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్లతో చేస్తున్నప్పుడు కూడా భయంగా అనిపించలేదు. అందరూ నన్ను అభిమానంగా చూసుకునేవారు. ‘నంది అవార్డు’ కూడా అందుకున్నా. ‘సింధూర పువ్వు’ నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమా. పెళ్లయిన తర్వాత సినిమాలకు కొంత దూరంగా ఉన్నా. చాలాకాలం నుంచీ అక్క సీరియళ్లు నిర్మిస్తున్నది. తన సలహాతో నేను, ఆయన (రాంకీ) ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించాం. సీరియళ్లు, సినిమాలు చేస్తున్నాం. తెలుగులో నాకు సరిపోయే పాత్రలు రాలేదు. దీంతో ఆసక్తి ఉన్నా ఇటువైపు రాలేకపోయాను. కథ కొత్తగా ఉండటం, నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో జీ తెలుగు ‘దేవతలారా దీవించండి’ సీరియల్కు ఓకే చెప్పాను. ఇలా మరోసారి తెలుగు ప్రేక్షకులను కలుసుకునే అదృష్టం దక్కినందుకు సంతోషంగా ఉంది.
ఇల్లు కదలను..
లేచింది మొదలు రకరకాల పనులతో చాలా బిజీగా ఉంటాం. ఆయన కూడా ఇండస్ట్రీ వ్యక్తే కావడంతో క్షణం ఖాళీ దొరకదు. ఏ చిన్న అవకాశం చిక్కినా ఇంట్లోనే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను. ఎప్పటికప్పుడు ఇంటిని కొత్తగా ఉంచుకుంటాను. నచ్చిన వంటలు చేస్తాను. బాగా తింటాను కూడా. నార్త్, సౌత్, చైనీస్.. అన్ని వెరైటీలూ ప్రయత్నిస్తా. జయసుధ, శ్రీదేవి నా అభిమాన తారలు. మంచి పాత్రలు వస్తే సినిమాల్లోనూ చేస్తాను. రమ్యకృష్ణలా పవర్ఫుల్ పాత్రల్లో నటించాలని ఉంది. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో?
చాలా తేడా ఉంది..
నేను సినిమాల్లో చేసిన రోజులకు, ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు అందరం ఒక దగ్గర కూర్చుని తినేవాళ్లం, కబుర్లు చెప్పుకొనేవాళ్లం. షాట్ గ్యాప్లో మంచీచెడులు మాట్లాడుకునేవాళ్లం. ఒకరికొకరం సలహాలు ఇచ్చుకునేవాళ్లం. కానీ ఇప్పుడు వాతావరణం చాలా మారిపోయింది. ఎవరి పని వాళ్లదే. మాట్లాడుకోవడం చాలా తక్కువ. మా రోజుల్లో సోషల్ మీడియా ఉంటే బాగుండేదేమో. అభిమానులకు మరింత దగ్గరయ్యే
అవకాశం ఉండేది.
– ప్రవళిక వేముల